బాబు లేఖను లెక్కచేయని కెసిఆర్: పాలమూరుపై ముందుకే..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర జల సంఘానికి రాసిన లేఖను లెక్కచేయకుండా పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ముందుకు సాగడానికే నిర్ణయించుకున్నారు.
ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సర్కిల్ను ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం గురువారంనాడు ఆదేశాలు జారీ చేసింది. మహబూబ్నగర్ కేంద్రంగా పనిచేసే ఈ సర్కిల్లో ఇంజనీర్లతో పాటు 212 మంది సిబ్బంది ఉంటారు.
జూన్ 11వ తేదీన ఆ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి కెసిఆర్ మహబూబ్నగర్ జిల్లాలో శంకుస్థాపన చేశారు. దానికి 35 వేల 200 కోట్ల రూపాయలు వ్యయమవుతుందని అంచనా. ఈ ప్రాజెక్టు ద్వారా మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. అంతేకాకుండా హైదరాబాద్కు మంచినీటిని కూడా ఈ ప్రాజెక్టు ద్వారా అందిస్తారు. దీనికి 90 టిఎంసిల నీటిని వాడుకుంటారు.
శ్రీశైలం జలశయానికి వరద నీరు వచ్చి పడుతున్నప్పుడు ప్రతి రోజూ ఈ ప్రాజెక్టు ద్వారా1.5 టిఎంసిల నీటిని ఎత్తిపోస్తారు. తెలుగుదేశం పార్టీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పినా ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపబోమని తెలంగాణ ప్రభుత్వం కచ్చితంగా చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ టిడిపి ప్రభుత్వ అభ్యంతరాలను నిరసిస్తూ జులై 10వ తేదీన తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) మహబూబ్నగర్ జిల్లా బంద్ను కూడా నిర్వహించింది.
పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్ర అనుమతి లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తోంది. దీన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబుతో పాటు ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి కేంద్రానికి లేఖ కూడా రాశారు. అయితే, ఇది కొత్త ప్రాజెక్టు కాదని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే దీన్ని తలపెట్టారని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది.
కృష్ణా నదీ జలాల్లో తమకు వచ్చే వాటాను ఎక్కడైనా వాడుకునే హక్కు తమకు ఉందని, పాలమూరు ఎత్తిపోతల పథకానికి 90 టిఎంసిల నీటిని వాడుకోకుండా ఎవరూ ఆపలేరని తెలంగాణ ప్రభుత్వం అంటోంది.