మీరు కబళించిన రాజ్యాంగ సంస్థలే రేపు మిమ్మల్ని కబళిస్తాయి?
దేశంలో ఏకస్వామ్య పార్టీ విధానం వస్తుందని భారతీయ జనతాపార్టీ అధ్యక్షులు చెబుతున్నారు. ఈ నిరంకుశ విధానం దేశానికి మంచిదేనా? ప్రశ్నించిన రైతులను కార్లతో తొక్కించారు.. రాజ్యాంగ సంస్థలను జేబు సంస్థలుగా మార్చి వాడుకుంటున్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రగతి భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశమంతా ఏక్ నాథ్ షిండేలను సృష్టిస్తామని బెదిరిస్తున్నారు.. ఇదేనా సమాఖ్య స్ఫూర్తి అని ప్రశ్నించారు.

ప్రభుత్వాలను కూల్చడమే సమాఖ్య స్ఫూర్తా?
ప్రభుత్వాలను కూల్చడమే సమాఖ్య విధానమా? పాలమీద, పెరుగుమీద, మజ్జిగమీద.. చివరకు స్మశానంలో కూడా పన్ను వేస్తున్నారు.. ఇప్పటికైనా ప్రధానమంత్రి తన బుద్ధి మార్చుకుంటారన్న ఉద్దేశంతోనే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.

జాతిపితను అవమానపరుస్తారా?
మహాత్మాగాంధీపై బీజేపీ అనుసరిస్తున్న తీరుపై కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. జాతిపితను , అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన వ్యక్తిని ఇలాగే అవమానపరుస్తారా? అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కేసీఆర్. మహత్మాగాంధీని పూజించే వాళ్లు, గాంధీ వంశం అని చెప్పుకునే వాళ్లు దేశంలో చాలామంది ఉన్నారని, అది తెలుసుకోవాలని సూచించారు. దేశంలో వాళ్ల చరిత్రను వాళ్లే మలినం చేసుకోవడం మీరు చూశారా? ఇది ఆటవిక సమాజమా? అనాగరిక సమాజమా? అని ప్రశ్నించారు. ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలని, బీజేపీకి సంబంధించిన సంఘాలు జాతిపితను ఇష్టం వచ్చినట్లు దూషిస్తున్నాయని, ప్రధానమంత్రి మోడీ మాత్రం నీతి ఆయోగ్పై గాంధీజీ కళ్లద్దాల గుర్తు పెడతారని, బీజేపీ సంఘాలు మాత్రం తుపాకులు ఎక్కుపెడుతాయన్నారు. గాంధీజీకి లేనటువంటి అవలక్షణాలు అంటగడుతున్నాయని, ఏ దేశంలోనైనా వారి జాతిపిత గురించి ఇలా జరుగుతుందా? అన్నారు.

ఉచితాలంటే ఏవీ..?
ఉచిత పథకాలు రద్దుచేయాలంటూ కొత్తగా ఒక అంశాన్ని తెరపైకి తెచ్చారని, వృద్ధులకు పింఛన్లు ఇవ్వడం, రైతులకు రైతుబంధు, రైతు బీమా ఇవ్వడం.. ఇవన్నీ ఉచితమా? లేదంటే కొన్ని వ్యాపార సంస్థలకు ఎన్ పీఏల పేరుతో రూ.12 లక్షల కోట్లు ఇవ్వడం ఉచితమా? ఎన్ పీఏలు తగ్గాలికానీ.. ఎందుకు 10 రెట్లు పెరిగాయని కేసీఆర్ ప్రశ్నించారు. ఇవి రూ.2 లక్షల నుంచి రూ.20 లక్షల కోట్లకు పెరిగాయని, మహత్తరమైన పాలన అంటే ఇదేనా? అన్నారు. రూ.లక్షల కోట్లు ఎగవేసి విదేశాలకు పారిపోయారని, మేకిన్ ఇండియా అంటే గాలిపటాలు ఎగరవేసే మాంజా కూడా చైనా నుంచే వస్తుందా?, అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విదేశీ మారక నిల్వలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయని, మనదేశంలో కూడా త్వరలోనే శ్రీలంక పరిస్థితులు వచ్చే ప్రమాదం ఉందని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారని కేసీఆర్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications