ఏం మాట్లాడ్తాం, దర్వాజాకు అడ్డం నిలబడ్తే అరెస్టే చేస్తారు: కెసిఆర్
కరీంనగర్: ప్రతిపక్షాల నేతలపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తీవ్రంగా ధ్వజమెత్తారు. గండిపల్లి, గౌరెల్లి రిజర్యాయర్లను పరిశీలించిన తర్వాత కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో ఆయన శనివారంనాడు మాట్లాడారు. మున్సిపల్ కార్మికులు, పంచాయతీరాజ్ ఉద్యోగుల వేతనాలను పెంచాలని కోరడానికి శుక్రవారం సచివాలయానికి వెళ్లిన ప్రతిపక్షాల నేతలను కలవడానికి కెసిఆర్ నిరాకరించారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటనపై కెసిఆర్ సభలో ప్రతిస్పందించారు.
దర్వాజకు అడ్డంగా నిలబడితే అరెస్టే చేస్తారని ఆయన అన్నారు. ప్రతిపక్షాల నేతలే సమ్మె చేయించారని, వారి సమస్యలు పరిష్కరించాలని కోరడానికి వచ్చారని, వారితో ఏం మాట్లాడుతామని, అందుకే వారికి తాను ఇంటర్వ్యూ ఇవ్వలేదని ఆయన చెప్పారు. మున్సిపాలిటీ కార్మికులు, గ్రామపంచాయతీ ఉద్యోగుల జీతాల పెంపు ప్రభుత్వం చేతిలో ఉండదని ఆయన చెప్పారు.
మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలు ఆదాయాన్ని బట్టి వేతనాలు ఇచ్చుకుంటాయని ఆయన అన్నారు. కాంగ్రెసు గానీ ఇతర పార్టీలు గానీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వారికి ప్రభుత్వాలే జీతాలు ఇస్తున్నాయా అని ఆయన అడిగారు. ప్రభుత్వ కార్యక్రమాలు చూసి ఓర్వలేక సమ్మెలు చేయిస్తున్నారని ఆయన అన్నారు. ప్రతిపక్షాల మాటలు వినకుండా కార్మికులు, ఉద్యోగులు విధుల్లో చేరాలని ఆయన అన్నారు. వారిని విధుల్లో చేర్పించండని, అప్పుడు సమస్యలు పరిష్కారనని చెప్పానని ఆయన అన్నారు.

వామపక్షాలు సమ్మె చేయించడం వల్ల వేయి మంది జిహెచ్ఎంసి కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారని ఆయన చెప్పారు. ప్రతిపక్షాలు నిర్మాణాత్మకమైన విమర్శలు, సూచనలు చేస్తే స్వీకరిస్తామని ఆయన చెప్పారు. వామపక్షాలు సమ్మెలు చేయిస్తాయని, ప్రభుత్వాన్ని పరిష్కరించాలని అడుగుతాయని ఆయన అన్నారు. వామపక్షాల తీరుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
గత ఆంధ్రప్రభుత్వాలు ఆరు కషికెల నీరు కూడా తేలేదని ఆయ అన్నారు. తాను మాటలు చెప్పడం లేదని, హుస్నాబాద్ నియోజకవర్గంలో నీరు పారుతుందని, లక్షా 50 వేల ఎకరాలకు గండివెల్లి , గౌరెల్లి రిజర్యాయర్ల ద్వారా నీరు అందిస్తామని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఉన్న రిజర్యాయర్ గుంట మాత్రమేనని, అందులోని నీరు పొలాలు పారడానికి సరిపోతాయా అని ఆయన అన్నారు. మోచేతికి బెల్లం పెట్టి నాకిచ్చినట్లు గోల్ మాల్ చేశారని ఆయన వ్యాఖ్యానించారు.
తాము నీళ్లిస్తామంటే, పనులు చేస్తామంటే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. ఆంధ్రవాళ్లు కట్టిన ప్రాజెక్టుల్లా కాకూడదని తాను ఇంజనీర్లకు చెప్పానని ఆయన అన్నారు. హామీ ఇస్తే తలకాయ తెగిపడినా వెనక్కి పోనని, తాను ఎంత మొండి ఘటమో ప్రజలకు తెలుసునని ఆయన అన్నారు. ప్రాజెక్టులపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన అన్నారు. ఏ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారనే విషయంతో ప్రమేయం లేకుండా గ్రామజ్యోతి కింద అన్ని నియోజకవర్గాలకు నిధులు విడుదల చేస్తామని ఆయన చెప్పారు. ప్రజల సంఘటిత శక్తిని తెలపడానికే గ్రామజ్యోతి కార్యక్రమాన్ని చేపట్టామని ఆయన అన్నారు.
ఇంటింటికీ నీరు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగబోనని చెప్పిన సిఎం భారతదేశంలో కెసిఆర్ ఒక్కడేనని ఆయన అన్నారు. రెప్పపాటు కూడా పోకుండా కరెంట్ సరఫరా చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications