కెసిఆర్! నిజాలు మాట్లాడు: ఎర్రబెల్లి, 'తాగుబోతులుగా మార్చేందుకా'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన తెలంగాణ టిడిపి నేతలు గురువారం నాడు భగ్గుమన్నారు. తెలంగాణ టిడిపి అధ్యక్షులు ఎల్ రమణ, శాసన సభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర రావు ప్రభుత్వం పైన విరుచుకు పడ్డారు.
పెండింగు ప్రాజెక్టులను పరిశీలిస్తామని టిడిపిని విమర్శిస్తూ టిఆర్ఎస్ రాజకీయ ఎత్తుగడలు వేస్తోందన్నారు. టిడిపి హయాంలో నాలుగు ప్రాజెక్టులకు రూ.1000 కోట్లు ఖర్చు చేశామని, నాలుగు ప్రాజెక్టులను ఏడాదిలో పూర్తి చేసే అవకాశమున్నా పట్టించుకోవడం లేదన్నారు.
ఎగువన నిర్మిస్తున్న ప్రాజెక్టులతో తెలంగాణ ఏడారి కాబోతుంటే టిఆర్ఎస్ ప్రభుత్వం కళ్లు తెరవడం లేదన్నారు. టిఆర్ఎస్ పాలనలో ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదన్నారు.
సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్లు నిజాలు మాట్లాడాలన్నారు. కెసిఆర్ మూర్ఖత్వం వదిలి అందర్నీ కలుపుకుపోవాలన్నారు. కమీషన్లు, కాంట్రాక్టుల కోసమే కొత్త ప్రాజెక్టులన్నారు. పెండింగ్ ప్రాజెక్టులపై అఖిలపక్షం వేయాలన్నారు.
తాగుబోతులుగా మార్చేందుకేనా: కిషన్ రెడ్డి
ప్రజలను తాగుబోతులుగా మార్చేందుకే తెలంగాణ ప్రభుత్వం చీప్ లిక్కర్ను తీసుకు వస్తుందని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గురువారం అన్నారు. గత ఏడాది ఫీజు రీయింబర్సుమెంట్సును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
గతేడాది ఫీజు, తాగుబోతులగా మార్చేందుకు, అఖిలపక్షం,
రోజుకో వాగ్ధానం: షబ్బీర్
టిఆర్ఎస్ నేతలు రోజుకో వాగ్ధానం ఇస్తూ వాటిని గాలికొదిలేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేత షబ్బీర్ అలీ మండిపడ్డారు. గురువారం ఆయన సిఎల్పీ కార్యాలయంలో మాట్లాడారు. గ్రామజ్యోతి కార్యక్రమానికి వేలాది కోట్లు కేటాయిస్తామని చెబుతున్న ప్రభుత్వం వాటిని ఎక్కడి నుంచి తెస్తుందో చెప్పాలన్నారు.
మెట్రో పనులను గాలికి వదిలేశారన్నారు. మన ఊరు - మన ప్రణాళిక అంటూ హడావుడి చేసిన కేసీఆర్ ఇప్పుడు దాన్ని వదిలేసి, గ్రామజ్యోతి అంటూ కొత్త నాటకానికి తెరలేపారన్నారు. గ్రామజ్యోతి కార్యక్రమానికి రూ.25 వేల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పుకుంటున్నారన్నారు.
కాగా, అంతకుముందు మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ కూడా మండిపడిన విషయం తెలిసిందే. వెంకయ్యను చూస్తే టిఆర్ఎస్ ఎంపీలు పిల్లుల్లా కూర్చున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయ అవసరాల కోసం ప్రధాని అడుగులకు మడుగులు ఒత్తడం మానుకోవాలన్నారు.