ఫాంహౌస్లో కేసీఆర్ కాలక్షేపం, వివరాలు అడిగారు
మెదక్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం పూర్తిగా ఫాంహౌస్లోనే గడిపారు. మెదక్ పార్లమెంటు ఉప ఎన్నికలో సిద్ధిపేట మండలంలోని తన స్వగ్రామమైన చింతమడకలో శనివారం ఓటు వేసిన అనంతరం. ఆయన.. మధ్యాహ్నం 2.30 గంటలకు ఫాంహౌస్కు చేరుకున్నారు.
రాత్రి అక్కడే బస చేశారు. ఆదివారం రోజంతా ఫాంహౌస్లోనే గడిపి పంటలకు సంబంధించిన వివరాలను ఫాంహౌస్ నిర్వాహకుడు, తన మిత్రుడు జహంగీర్ను అడిగి తెలుసుకున్నారు. మనవడు, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కుమారడు హిమాంశ్తో గడిపి కాలక్షేపం చేశారు. సాయంత్రం కేసీఆర్ అక్కడి నుంచి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.
కాగా, కేసీఆర్ తన మనవడి ముచ్చటను తీర్చిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తనయుడు హిమాంశ్కు చింతమడకలో తన తాత పెరిగిన ఇంటిని చూడాలనే కోరిక ఉండింది. దీనిని ఆయన తాతయ్యకు చెప్పారు కూడా! తన తాతయ్య ముందు మనవడు హిమాంశ్ పలుమార్లు ఈ విషయాన్ని వెల్లడించారు.
అయితే, తెలంగాణ ఉద్యమం, పార్టీ, రాజకీయాలు, ఇప్పుడు ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రిగా కావడంతో కేసీఆర్ ఎప్పుడు బిజీగా ఉండేవారు. దీంతో మనవడి కోరికను ఇన్నాళ్లు తీర్చలేకపోయారు. శనివారం మెదక్ లోకసభకు ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. కేసీఆర్ ఓటు వేసేందుకు తన స్వగ్రామం చింతమండకకు తీసుకొని వెళ్లారు.
పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన అనంతరం.. రెండు దశాబ్దాల కిందట పాఠశాలకు ఇచ్చిన ఇంటి వరకు మనవడితో కలిసి కాలి నడనక వెళ్లారు. హిమాంశ్ను లోపలకు తీసుకు వెళ్లి ప్రతి గదిని చూపించారు. బంగ్లా ఎక్కి.. వెనుక ఉన్న వరండాని పాఠశాలకే ఇచ్చేశామని, అక్కడ మరో భవనం కట్టారని తెలిపారు. ఇంత పెద్ద ఇల్లా అని మనవడు ప్రశ్నించడంతో.. మా చిన్నాన్నకు మరింత పెద్ద ఇల్లుండేదని చెప్పారు. ఈ సందర్భంగా మనవడు అడిగిన ప్రశ్నలకు కేసీఆర్ ఆప్యాయంగా సమాధానం చెప్పారు.