ఆ తలనొప్పి వద్దనే?: పంచాయతీ ఎన్నికలపై కేసీఆర్ వ్యూహం..
కులవృత్తులకు పునరుజ్జీవం పేరుతో ఇప్పటికే ఆయా సామాజిక వర్గాలను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేసిన కేసీఆర్.. ఇప్పుడు ఎస్టీ సామాజిక వర్గంపై కూడా గట్టిగానే ఫోకస్ చేస్తున్నారు.
Recommended Video
హైదరాబాద్: వ్యూహాత్మక రాజకీయాలు చేయడంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ధిట్ట. ఈ విషయం ఇప్పటికే పలుమార్లు నిరూపితమైంది. అందుకే ఆయన రాజకీయ చతురతను ఎదుర్కొనే మరో నాయకుడు తెలంగాణలో ప్రస్తుతానికి లేడనేది విశ్లేషకుల అభిప్రాయం.
ప్రతిపక్షాలు మాత్రం కేసీఆర్ ప్రభావాన్ని తగ్గించేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. మరోవైపు కేసీఆర్ ప్రతిపక్షాల కన్నా వేగంగా ప్రజలను ఆకర్షించే పనులను ముందేసుకుంటున్నారు. కులవృత్తులకు పునరుజ్జీవం పేరుతో ఇప్పటికే ఆయా సామాజిక వర్గాలను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేసిన కేసీఆర్.. ఇప్పుడు ఎస్టీ సామాజిక వర్గంపై కూడా గట్టిగానే ఫోకస్ చేస్తున్నారు.
ఇప్పుడే ఎందుకు తెర పైకి:
వచ్చే ఏడాది జరగబోయే పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తండాలను, గోండు గూడెంలను గ్రామ పంచాయితీలుగా మార్చడం ద్వారా వారి ఆదరణ చూరగొనాలని భావిస్తున్నారు. నిజానికి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్ల లోపే కేసీఆర్ తండాలను గ్రామ పంచాయితీగా మార్చే చర్యలు తీసుకొని ఉండవచ్చు. కానీ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఆయన తన ఆలోచనను వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది.
ఆ తలనొప్పి వద్దనే:
పైగా ఈ మూడేళ్లలో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ వచ్చారు కేసీఆర్. దీంతో మరో ప్రాజెక్టుకు నిధులు కేటాయించడం లేని తలనొప్పిని పెట్టుకున్నట్టే అని భావించి ఉండవచ్చు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చే పనిని ముందేసుకుని నిధులు కేటాయించకుండా ఉంటే.. ప్రభుత్వ చిత్తశుద్దిపై ప్రజలు విశ్వసనీయత కోల్పోయే అవకాశం ఉంది.
ఎన్నికల్లో లాభిస్తుందని:
తండాలను, గోండు గూడెంలను ఇతర గిరిజన గ్రామీణ ప్రాంతాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తామన్న హామితో పంచాయతీ ఎన్నికల్లో లబ్ది పొందాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే వరంగల్ జిల్లాలో టెక్స్ టైల్ పార్కు శంకుస్థాపన సందర్భంగా కేసీఆర్ ప్రధానంగా ఈ అంశాన్ని ప్రస్తావించినట్టు చెబుతున్నారు.
కొత్తగా మరో నాలుగువేలు:
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 8684 గ్రామ పంచాయతీలకు అదనంగా మరో నాలుగు నుంచి 5వేల కొత్త గ్రామపంచాయతీలను ఏర్పాటు చేస్తామని వరంగల్లో కేసీఆర్ ప్రకటించారు.
గ్రామీణ వ్యవస్థ రూపు రేఖలను మార్చే విధంగా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెడుతామని కేసీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే. నిర్దేశిత సమయానికే ఎన్నికలను నిర్వహిస్తామని కూడా ఆయన చెప్పారు.