పిచ్చోడు గోవర్ధన్, తప్పుడు వ్యాసాలు రాస్తున్నాడు: కెసిఆర్
ఆదిలాబాద్: గోవర్ధన్ అనే ఓ పిచ్చోడు ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుపై రాద్ధాంతం చేస్తున్నాడని, కనీస పరిజ్ఞానం లేకుండా పత్రికలలో తప్పుడు వ్యాసాలు రాస్తున్నాడని, ప్రజలను పక్కతోవ పట్టిస్తున్నాడని జల సాధన సమితి నేత నైనాల గోవర్ధన్పై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు విరుచుకుపడ్డారు. సభలో అనుచరులతో కలిసి నల్లజెండాలు ప్రదర్శించిన గోవర్ధన్ను ఉద్దేశించి ఆయన తీవ్రంగా మండిపడ్డారు
అరుపులు మానండని, లేదంటే మర్యాద ఉండదని, మంచి మాటతో వినకపోతే గుణపాఠం తప్పదని ఆయన హెచ్చరించారు. మీకంటే ఎక్కువ నాకు తెలుసని అన్నారు. ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి ప్రాంతంలో గూడెం ప్రాజెక్టును ఆదివారం ముఖ్యమంత్రి ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించడానికి సిద్ధమైన సమయంలో నల్లజెండాలు పైకి లేచాయి.
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరానికి తరలించడంపై ఉద్యమం సాగిస్తున్న జలసాధన సమితి నేతలు సభలో నినాదాలు చేశారు. గోవర్ధన్ నాయకత్వంలో నిరసనకు వారు ప్రయత్నించగా.. ఆయనపై కెసిఆర్ పెద్దగా మండిపడ్డారు. జెండాలు చూపేవారికి సంస్కారముందా! బిత్తిరి నినాదాలు ఆపాలని గట్టిగా అన్నారు. ఈ సమయంలో సమితి నేతలు నినాదాలు చేశారు. దీంతో కేసీఆర్ తీవ్ర అసహనానికి గురయ్యారు.
‘మీకు బుద్ధి లేదా! మొదలు జెండాలు దించండి. మీ కథ ఏందో చెప్తా!' అని అన్నారు. ప్రాణహిత ప్రాజెక్టు తరలిస్తే మీకేమిటి? అని ప్రశ్నించారు. దమ్ముంటే వచ్చి తనతో మాట్లాడాలని తీవ్రంగా అన్నారు. జెండాలు ఊపిన సన్నాసులకు తెలివి లేదన్నారు. ఇటువంటి సన్నాసులు ఎంతమంది వచ్చినా తాను భయపడబోనని, గోవర్ధన్కు ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని కెసిఆర్ అన్నారు.