షాక్: రాహుల్ గాంధీ లాగులు తడుస్తాయన్న కేసీఆర్, ఏపీకి హోదా సరే మాకేంటో చెప్పాలి
ఇబ్రహీంపట్నం: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం ఇబ్రహీంపట్నం బహిరంగ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. మేడ్చల్ బహిరంగ సభలో యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని, దానికి కట్టుబడి ఉన్నామని చెప్పిన విషయం తెలిసిందే.
దీనిని ఉద్దేశించి కేసీఆర్.. ఏఐసీసీ రాహుల్ గాంధీ పైన తీవ్రపదజాలం ఉపయోగించారు. హైదరాబాదుకు వచ్చి ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెబుతున్నారని, కానీ రాహుల్ మళ్లీ తెలంగాణలో అడుగు పెట్టాలంటే తమకు ఇస్తామన్న ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ పైన సమాధానం చెప్పాలని, తమకు ఏమిస్తారో చెప్పకుంటే మీ లాగులు తడుస్తాయని రాహుల్ గాంధీని ఉద్దేశించి అన్నారు.
తెలంగాణకు ఎలాంటి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇస్తారో చెప్పాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఎన్నికల ప్రచారం కోసం రాహుల్ గాంధీ ఈ నెలాఖరులో, డిసెంబర్ మొదటి వారంలో కూడా రానున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో మళ్లీ అడుగు పెట్టాలంటే దీనికి సమాధానం చెప్పాలని, లేదంటే లాగులు తడుస్తాయని చెప్పడం గమనార్హం.
కేసీఆర్ ఈ కామెంట్స్ను ఇబ్రహీంపట్నం బహిరంగ సభలో అన్నారు. ఈ సభలోనే కాంగ్రెస్ పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు చేసిన క్యామ మల్లేష్ తెరాసలో చేరారు. కేసీఆర్ ఇబ్రహీంపట్నం తెరాస అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు.