ఏపీకి భంగపాటు, శని విరగడైనట్టే: సుప్రీం నిర్ణయంపై కెసిఆర్ హర్షం
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమైన పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలపై కేంద్ర జలవనరులశాఖ మంత్రి, రెండు రాష్ట్రాల సీఎంలు సభ్యులుగావున్న అపెక్స్ కౌన్సిల్ను ఏర్పాటు చేసి సమస్యల పరిష్కరించాలని కేంద్రానికి సుప్రీం కోర్టు నిర్దేశించింది. ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రాజెక్టులకు అనుమతులిచ్చారని తెలంగాణ వాదనలు వినిపించగా, ఇప్పటివరకు ప్రాజెక్టు సమగ్ర నివేదిక కేంద్రానికి సమర్పించలేదని, కనీసం సర్వే సైతం పూర్తి చేయలేదని పిటీషనర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధర్మాసనం ముందు వాదనలు వినిపించాయి.
పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాల నిర్మాణం వల్ల కృష్ణా డెల్టాకు నష్టం వాటిల్లుతోందంటూ కృష్ణా జిల్లా రైతు నాయకుడు ఆళ్ల వెంకట గోపాల కృష్ణారావు దాఖలు చేసిన పిటీషన్ను బుధవారం సుప్రీంకోర్టు విచారించింది. న్యాయమూర్తులు జస్టిస్ జగదీష్ సింగ్ ఖేహర్, జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ కురియాన్ జోషెఫ్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం ఈ పిటిషన్ను విచారించింది.
మొదట తెలంగాణ తరఫున న్యాయవాది వైద్యనాథన్ వాదనలు వినిపిస్తూ రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదంలో ఒక వ్యక్తి దాఖలు చేసిన రిట్ పిటీషన్ విచారణార్హం కాదన్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే ఎత్తిపోతల పథకాలకు అనుమతులు లభించాయని సుప్రీం దృష్టికి తీసుకొచ్చారు. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి వివాదాలు తలెత్తినపుడు పరిష్కరించేందుకు ఏదైనా ఫోరం ఉందా? అని సుప్రీం ధర్మాసనం న్యాయవాదులను ప్రశ్నించింది.
దీనిపై పిటిషనర్ తరపున్యాయవాది వాదనలు వినిపిస్తూ విభజన చట్టలో సెక్షన్ 84 ప్రకారం గోదావరి, కృష్ణా నదీ జల యాజమాన్య మండలి ఏర్పాటు చేశారని, అందులో అపెక్స్ కౌన్సిల్ (ఒక శిఖరాగ్ర మండలి) కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, ఈ కౌన్సిసల్లో కేంద్ర జలవనరుల మంత్రి, రెండు రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా ఉన్నారని కోర్టుకు వివరించారు.
తర్వాత కేంద్రం తరఫు న్యాయవాది ఖాద్రి వాదనలు వినిపిస్తూ ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర నివేదికను రాష్ట్రం తమకు సమర్పించలేదని తెలిపారు. అసలు పాలమూరు, డిండి ప్రాజెక్టులను కృష్ణా నదిపైవున్న శ్రీశైలం ప్రాజెక్టు కింద కడుతున్నారని , అప్పట్లో జూరాల ప్రాజెక్టు నుంచి పాకాల జూరాల ప్రాజెక్టు నిర్మాణానికి మాత్రమే అనుమతులిచ్చారని పిటీషనర్ తరపున న్యాయవాది వివి గిరి వాదనలు వినిపించారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాతే ఆ ప్రభుత్వం జీవో 80, 81 తీసుకొచ్చిందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. షెడ్యూల్ 11లో ఈ ప్రాజెక్టు గురించి ప్రస్తావించలేదని, విభజన చట్టంలోని సెక్షన్ 84 ప్రకారం అపెక్స్ కౌనె్సల్ అనుమతి ఉండాలని వాదించారు. ఎత్తిపోతల పథకాల వల్ల నదీ పరీవాహకంలో కింద మిగిలిన ప్రాంతంపై ప్రాజెక్టు ప్రభావం చూపుతుందా? లేదా? అని పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సింది అపెక్స్ కౌన్సిలేనని ధర్మాసనం ముందు వివి గిరి వాదించారు.
తెలంగాణ ఈ రెండు కొత్త ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన సర్వే సైతం పూర్తి చేయలేదని ఏపీ తరఫున న్యాయవాది ఏకె గంగూలీ ధర్మాసనం ముందు వాదించారు. ప్రాజెక్టు సమగ్ర నివేదికను కేంద్రానికి, అపెక్స్ కౌన్సిల్కి సమర్పించాల్సి ఉండగా ఇలాంటివి తెలంగాణ ప్రభుత్వం చేయలేదని ధర్మాసనం ముందు ఏపీ వాదనలు వినిపించింది.
అయితే ధర్మాసనం ఈ వివాదంపై అపెక్స్ కౌన్సిల్కి వెళ్లాలని సూచించింది. అయితే అపెక్స్ కౌన్సిల్కు వెళ్లేందుకు తమ పిటీషనర్కు అర్హత లేదని న్యాయవాది వివి గిరి ధర్మాసననాకి విన్నవించారు. రెండు రాష్ట్రాలను పార్టీలుగా చేర్చి అపెక్స్ కౌన్సిల్కు వెళ్లేందుకు ధర్మాసనం ఆదేశించింది. అలాగే అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని కేంద్రానికి కోర్టు నిర్దేశించింది.
ఏపీకీ భంగపాటు, శని విరగడైనట్టే: కెసిఆర్
సుప్రీంకోర్టు తీర్పుతో పాలమూరు ప్రాజెక్టుకు పట్టిన శని విరగడైందని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పాలమూరు, డిండి సాగునీటి ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన పిటిషన్పై సుప్రీం కోర్టు వెల్లిబుచ్చిన స్పందనపట్ల కెసిఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక ఈ ప్రాజెక్టులకు శాశ్వతంగా అడ్డంకులు తొలిగినట్టేనని అభిప్రాయపడ్డారు.
సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిబంధనల మేరకు వ్యవహరిస్తున్నా, ఆంధ్రప్రదేశ్ సర్కారు తరచూ అర్థంలేని అభ్యంతరాలను వ్యక్తంచేస్తూ భంగపడుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు.
ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చిన ఆయన... తన నివాసానికి చేరుకున్నాక ఈ అంశంపై ఉన్నతాధికారులతో కలిసి చర్చించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏపీ అభ్యంతరాలకు ఎక్కడా పెద్దగా విలువ లేనందున, పాలమూరు, డిండి ప్రాజెక్టులను శరవేగంగా నిర్మించాలని నీటిపారుదల శాఖను ఆదేశించారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో మంత్రులు హరీశ్రావు, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి ఎంపీలు జితేందర్రెడ్డి, గుత్తా సుఖేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు ఆలం వెంకటేశ్వరరెడ్డి, జీవన్రెడ్డి, నీటిపారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్ తదితరులతోనూ సీఎం సమావేశమయ్యారు. సుప్రీంకోర్టు స్పందించిన తీరు పట్ల ముఖ్యమంత్రి, మంత్రులు సంతోషం వ్యక్తంచేశారు.

సుప్రీంకోర్టు తాజా స్పందనతోనైనా ఏపీ ప్రభుత్వ వైఖరి మారాలనీ, ఈ తీర్పు పాలమూరు, నల్గొండ జిల్లాల ప్రజలకు గొప్ప ఊరటని అన్నారు. తీవ్ర కరవు పరిస్థితులు నెలకొన్న ఈ రెండు జిల్లాల రైతులకు సాగునీరు అందించడం అత్యంత అవసరమనీ, రాకెట్ వేగంతో పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలను పూర్తిచేయాలని నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు. ఆ శాఖ మంత్రితో పాటు ఆయా జిల్లాల మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ వేగంగా స్పందించాలని, చిన్న సమస్య తలెత్తినా రంగంలోకి దిగి పరిష్కరించాలని సీఎం సూచించారు.
సాగునీటి విషయంలో తీవ్ర వివక్షకు గురైన మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల్లో ఎంతో దుఃఖం ఉందనీ, ఆ గోస తీర్చడానికి ప్రజాప్రతినిధులు ఎంతో చొరవ ప్రదర్శించాలన్నారు. పాలమూరు జిల్లాలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేసి, గురువారం ప్రారంభోత్సవాలు కూడా జరుపుతుండటం పట్ల ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తంచేశారు. మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. ఇదే వేగంతో మిగిలిన ప్రాజెక్టుల పనులనూ పూర్తిచేయాలని అధికారులకు సూచించారు.
ఇది ఇలా ఉండగా సుప్రీం తీర్పుపై స్పందించిన ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేసి డిండీ, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుల వివాదాన్ని సుప్రీంకోర్టు బుధవారం కేంద్రాన్ని ఆదేశించడాన్ని తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. కేంద్రవనరుల శాఖ మంత్రి ఉమాభారతి తక్షణం స్పందించి అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.
సుప్రీం ఆదేశాలు పాటిస్తాం: ఉమాభారతి
అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటుపై సుప్రీంకోర్టు ఆదేశాలు పాటిస్తామని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి తెలిపారు. అధికారులతో చర్చించి సమావేశ తేదీలను నిర్ణయిస్తామని వెల్లడించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు.. తామే నిర్మిస్తామని కేంద్రమంత్రి ఉమాభారతి తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు నిధుల సమస్య లేనేలేదని, అనుకున్న సమయానికి పోలవరం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications