మెదక్లో కెసిఆర్ ప్రచారం: కెటిఆర్, హరీశ్ థ్యాంక్స్
హైదరాబాద్: మెదక్ పార్లమెంటు స్థానానికి జరుగనున్న ఉప ఎన్నికల్లో గెలుపు తమదేనని తెలంగాణ రాష్ట్ర ఐటి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. మెదక్ ఉప ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఒక రోజు పాల్గొంటారని తెలిపారు.
కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు డిపాజిట్ల కోసం పాకులాడుతున్నాయని ఎద్దేవా చేశారు. మాజీ సిఎం కిరణ్ కుమార్ రెడ్డికి తొత్తులుగా ఉన్న సునీతా లక్ష్మారెడ్డి, జగ్గారెడ్డికి ప్రజలు బుద్ధి చెబుతారని తెలిపారు.
టిఆర్ఎస్ పార్టీలోకి ఎవరు వచ్చినా స్వాగతిస్తామని చెప్పారు. మీణాభివృద్ధికి ప్రభుత్వం పారదర్శకంగా పని చేస్తోందన్నారు. సమగ్ర సర్వే వివరాలను ప్రభుత్వం క్రోడీకరిస్తోందని తెలిపారు. సర్వే వివరాలు ఎవరికీ ఇబ్బంది లేనివిధంగా ప్రజల ముందు ఉంచుతామన్నారు.
వామపక్షాలకు హరీశ్ రావు కృతజ్ఞతలు
మెదక్ ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించిన సిపిఐ, సిపిఎం నాయకులు, కార్యకర్తలకు మంత్రి హరీశ్ రావు కృతజ్ఞతలు తెలిపారు. సిపిఐ, సిపిఎం కార్యకర్తలను సమన్వయం చేసుకొని ప్రచారంలో పాల్గొనాలని టిఆర్ఎస్ కార్యకర్తలకు హరీశ్ రావు సూచించారు.