మూసేయకండి: పారికర్కు కెసిఆర్ లేఖ, ఓరుగల్లులో నటి రోజా రోడ్డు షో
హైదరాబాద్/న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్కు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం లేఖ రాశారు. నగరంలోని ఏవోసీ నుంచి గఫ్రోడ్ వరకు ఉన్న రహదారిని మూసేయద్దని కోరారు.
రహదారిని మూసివేస్తే స్థానికులు ఇబ్బందులు పడతారని చెప్పారు. జీహెచ్ఎంసీ ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేసేంత వరకు ఈ రహదారిని తెరిచే ఉంచాలని ఆయనను కెసిఆర్ కోరారు.
సింగరేణి పరీక్షల్లో అవకతవకలు జరగలేదు: పవిత్రన్
మేనేజ్మెంట్ ట్రైనీ, జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్-2 సింగరేణి పరీక్షల్లో అవకతవకలు జరుగలేదు ఆ సంస్థ అధికారి పవిత్రన్ గురువారం కరీంనగర్ జిల్లాలో స్పష్టం చేశారు. పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లుగా వస్తున్న ఆరోపణలపై ఆయన స్పందించారు. పరీక్షల్లో అక్రమాలు జరిగినట్లు కొందరు దుష్ప్రచారం చేశారన్నారు.
ఒకే ఇంటి పేరున్నవారు ఎక్కువ మంది ఉత్తీర్ణులు అయ్యారన్నది అవాస్తవమన్నారు. ఇంటి పేరు ఒకటే ఉన్నా అభ్యర్థులు వేర్వేరు ప్రాంతాలు, కులాలకు చెందిన వారు అని చెప్పారు. ఈ ఆరోపణలపై మా విజిలెన్స్ అధికారులతో దర్యాప్తు జరిపించామని, ఎవరి వద్దనైనా ఆధారాలుంటే మళ్లీ విచారణ జరిపేందుకు సిద్ధమన్నారు.
చంద్రబాబుతో తెలంగాణ టిడిపి నేతల భేటీ
చంద్రబాబుతో తెలంగాణ టిడిపి నేతలు ఎల్ రమణ, రేవంత్ రెడ్డిలు భేటీ కానున్నారు. ఇందుకోసం వారు విజయవాడ వెళ్లారు. బెజవాడలోని సిఎం క్యాంప్ కార్యాలయంలో వారు చంద్రబాబుతో భేటీ అవుతారు. వరంగల్ ఉప ఎన్నికల అంశంపై చర్చిస్తారు.
వరంగల్లో రోజా రోడ్డు షో
వరంగల్ ఉప ఎన్నికల నేపథ్యంలో వైసిపి ఎమ్మెల్యే రోజా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో భాగంగా గురువారం వరంగల్లోని రైల్వే గేట్ వద్ద రోడ్డు షో నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ... వైయస్ ఆశయ సాధన కోసం వైసిపి అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్కు ఓటు వేసి గెలిపించాలని కోరారు.