తెలంగాణలో రూ. 80కే పెట్రోల్ ఇవ్వొచ్చు: ఇక దేశాన్ని ఉద్దరిస్తారట అంటూ కేసీఆర్పై బండి సంజయ్ ఫైర్
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. అందుకే, రష్యా- ఉక్రెయిన్ యుద్ధ ప్రభావమున్నా కేంద్ర ప్రభుత్వం చమురు ధరలను తగ్గించిందని అన్నారు. పెట్రో ధరలు తగ్గించినందుకు ఆయన ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు. కరీంనగర్లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.
తెలంగాణలో రూ. 80కే లీటర్ పెట్రోల్ ఇవ్వొచ్చు: బండి సంజయ్
కేంద్రం మాదిరిగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. 'లీటర్ పెట్రోల్పై రాష్ట్ర ప్రభుత్వం రూ.30 పన్ను విధిస్తోంది. రాష్ట్రం వ్యాట్ తగ్గిస్తే లీటర్ పెట్రోల్ రూ.80కే ఇవ్వొచ్చన్నారు. దోచుకున్న సొమ్ము దాచుకునేందుకే కేటీఆర్ విదేశీ పర్యటనకు వెళ్లారని దుయ్యబట్టారు.
ఇక్కడ చేసిందేమీ లేదు కానీ, దేశాన్ని ఉద్ధరిస్తారట: కేసీఆర్పై బండి
సీఎం కేసీఆర్ రాష్ట్రం చేసిందేమీ లేదు కానీ.. దేశాన్ని ఉద్ధరిస్తారట అంటూ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలిచ్చే పరిస్థితి లేదు.. కానీ ఇతర రాష్ట్రాల వారికి సాయం చేస్తారట అని మండిపడ్డారు. రాష్ట్రంలో పింఛన్లు సక్రమంగా ఇచ్చే పరిస్థితి లేదన్నారు. కొండగట్టులో ప్రజలు చనిపోతే సీఎం పరామర్శించారా? అని ప్రశ్నించారు. సమ్మెలో ఆర్టీసీ కార్మికులు చనిపోతే వారినైనా పరామర్శించారా?' అని బండి సంజయ్ నిలదీశారు.
కేసీఆర్ ఏం సంచలనం సృష్టిస్తారో చెప్పాలన్న బండి సంజయ్
ఇక సీఎం కేసీఆర్ దేశంలో ఏం సంచలనం సృష్టిస్తారో ప్రజలకు చెప్పాలన్నారు బండి సంజయ్. పెట్రోల్, డిజిల్ పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించించడంతో పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వ్యాట్ తగ్గించాలన్నారు. అక్రమ ఆస్తులను కాపాడుకోవడానికే కేటీఆర్ విదేశీ పర్యటనలు చేస్తున్నారన్నారు.
కేంద్రం వ్యాట్ తగ్గించింది.. మీ సంగతేంటి కేసీఆర్ అంటూ కిషన్ రెడ్డి
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా కేసీఆర్ సర్కారుపై మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై పన్ను తగ్గించిందని.. ఇక కేసీఆర్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించి తెలంగాణ ప్రజలపై కనికరం చూపాలని అన్నారు. గత ఆరు నెలల్లో కేంద్రం రెండుసార్లు డీజిల్, పెట్రోల్ పై వ్యాట్ తగ్గించిందని తెలిపారు. రాష్ట్రం కూడా తగ్గిస్తే ప్రజలకు మరింత ఊరట కలుగుతుందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా తగ్గించిందని కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్రానికి ఈ తగ్గింపుతో రూ. లక్ష కోట్ల ఆదాయం నష్టపోవాల్సి వస్తున్నా.. ప్రజల కోసం మోడీ సర్కారు ఈ నిర్ణయం తీసుకుందన్నారు. గత ఆరు నెలల్లో వ్యాట్ తగ్గించడం ఇది రెండోసారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ప్రజల గురించి ఏమాత్రం ఆలోచించడం లేదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయన్నారు. వెంటనే కేసీఆర్ సర్కారు పెట్రో ధరలపై పన్ను తగ్గించి రాష్ట్ర ప్రజలకు మరింత ఊరటనివ్వాలని డిమాండ్ చేశారు.