ప్రీతి ఆత్మహత్య: కేఎంసీ హెచ్ఓడీపై బదిలీ వేటు, మరో కాలేజీకి..
కాకతీయ మెడికల్ కాలేజీ(కేఎంసీ)లో మొదటి సంవత్సరం చదువుతున్న అనష్థీషీయా విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య ఘటన నేపథ్యంలో ప్రభుత్వం హెచ్ఓడీపై చర్యలు తీసుకుంది.
వరంగల్: కాకతీయ మెడికల్ కాలేజీ(కేఎంసీ)లో మొదటి సంవత్సరం చదువుతున్న అనష్థీషీయా విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య ఘటన నేపథ్యంలో ప్రభుత్వం హెచ్ఓడీపై చర్యలు తీసుకుంది. ప్రీతిని వేధించిన సీనియర్ విద్యార్థి సైఫ్ను మందలించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలపై ఇటీవల ఎంజీఎంలో త్రిసభ్య కమిటీ విచారణ జరిపింది.
ఈ కమిటీ నివేదిక ఆధారంగా అనస్థీషీయా విభాగం హెచ్ఓడీ డాక్టర్ నాగార్జున రెడ్డిపై ప్రభుత్వం తాజాగా బదిలీ వేటు వేసింది. ఆయనను భూపాలపల్లి జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీ అనస్థీషియా విభాగం హెచ్ఓడీగా బదిలీ చేస్తూ వైద్యారోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రీతి కుటుంబ సభ్యులు, వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు.. హెచ్ఓడీ నాగార్జున రెడ్డి తప్పిదంపైనే మొదట్నుంచి ప్రశ్నిస్తున్నారు. నాగార్జున రెడ్డితోపాటు కేఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ లను డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అనస్థీషీయా హెచ్ఓడీ నాగార్జున రెడ్డి ఒక్కరిపైనే.. అది కూడా బదిలీ వేటు వేయడం మరోసారి విమర్శలకు తావిచ్చినట్లయింది.
కాగా, సీనియర్ సైఫ్ వేధింపులు భరించలేక ప్రీతి ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో ప్రభుత్వం ప్రీతి కుటుంబానికి నష్టపరిహారం ప్రకటించింది. అన్ని విధాలా ఆదుకుంటామని పేర్కొంది.












Click it and Unblock the Notifications