తెలంగాణ ఏ ఒక్కరితోనే రాలేదు: కోదండరామ్
కరీంనగర్/హైదరాబాద్: తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరామ్ గురువారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏ ఒక్కరితోనే రాలేదన్నారు. ప్రతి ఒక్కరు ఉద్యమంలో పాల్గొన్నారని ఆయన చెప్పారు.
తెలంగాణ ప్రజలు అందరూ పోరాటం చేస్తేనే తెలంగాణ కల సాకారమైందని చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత కార్పోరేట్ పెత్తనం తగ్గిందని ఆయన చెప్పారు.
క్యాబినెట్ హోదా చట్టవిరుద్ధం
తెలంగాణ రాష్ట్రప్రభుత్వం వివిధ కార్పొరేషన్లకు నియమించిన చైర్మన్లకు, ప్రత్యేక ప్రతినిధులకు, సలహాదారులకు క్యాబినెట్ హోదా కల్పించడాన్ని సవాలు చేస్తూ నల్గొండ కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి గురువారం హైకోర్టులో ప్రజావ్యాజ్యం కింద పిటిషన్ దాఖలు చేశారు.
క్యాబినెట్ హోదా కల్పించినందువల్ల వీరికి చెల్లించే భత్యం, వేతనాలు పెరిగి ఖజానాపై భారం పడుతోందన్నారు. మంత్రులు కాని వారికి క్యాబినెట్ హోదా కల్పించడమంటే, మంత్రులుగా ఉన్న వారి హోదాకు భంగం కలిగించినట్లవుతుందన్నారు.
సలహాదారులు ఆర్ విద్యాసాగర రావు, ఏకే గోయల్, ఏ రామకృష్ణన్, బీవీ పాపారావు, కేవీ రమణాచారి, జీఆర్ రెడ్డి, ప్రత్యేక ప్రతినిధులు ఎస్ వేణుగోపాలా చారి, రామచంద్రుడు తేజోవత్, కేఎం సాహ్ని, తెలంగాణ పర్యాటక సంస్ధ చైర్మన్ పేర్వారం రాములు, తెలంగాణ ఎస్సీ సహకార అభివృద్ధి సంస్ధ చైర్మన్ పిడపర్తి రవి, తెలంగాణ ప్రణాళిక మండలి ఉపచైర్మన్ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, తెలంగాణ సాంస్కృతిక సారథి బాలకిషన్, తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణలకు క్యాబినెట్ హోదా కల్పించారన్నారు.
చట్టానికి అనుగుణంగా క్యాబినెట్ హోదాను కల్పిస్తూ ఎటువంటి మార్గదర్శకాలను ప్రభుత్వం రూపొందించలేదన్నారు. ఒక శాసనసభలో ఉన్న ప్రజాప్రతినిధుల సంఖ్యలో 15 శాతం మంది మంత్రులుగా నియమించి క్యాబినెట్ హోదా కల్పించాలని రాజ్యాంగంలోని అధికరణ 164 (1ఏ)లో పేర్కొన్నారన్నారు.