మునుగోడు ప్రచారంపై తేల్చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి: హోంగార్డులు కాదు, ఎస్పీలే..
హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సిట్టింగ్ స్థానం కోసం కాంగ్రెస్, సిట్టింగ్ అభ్యర్థిని గెలిపించుకునేందుకు బీజేపీ, తమ అభ్యర్థిని విజయం కోసం అధికార టీఆర్ఎస్ ఇప్పటికే అవిరామంగా శ్రమిస్తున్నాయి. అయితే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరుడు కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం రాజకీయంగా వేడిపుట్టిస్తోంది.
మునుగోడు ప్రచారానికి దూరంగా వెంకటరెడ్డి
మునుగోడులో ప్రచారం చేస్తారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నా.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం ససేమిరా అంటున్నారు. మరోవైపు, కొందరు కాంగ్రెస్ నేతలతోపాటు టీఆర్ఎస్ నేతలు కూడా వెంకటరెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే, సీనియర్ నేత అయిన తనను కొందరు జూనియర్ తనను అవమానకర రీతిలో దూషించడం వల్లే తాను మునుగోడు ప్రచారానికి దూరంగా ఉంటున్నట్లు ఇప్పటికే వెంకటరెడ్డి చెప్పారు.
హోంగార్డులు అవసరం లేదంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్
తాజాగా, హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి వెళ్లనని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి స్పష్టం చేశారు. అక్కడ తనలాంటి హోంగార్డు ప్రచారం అవసరం లేదని.. ఎస్పీ స్థాయి వాళ్లే వెళ్తారని అన్నారు. గతంలో రేవంత్ రెడ్డి, అద్దంకి దయాకర్ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ మేరకు స్పందించారు.
రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు
100 కేసులు పెట్టినా సరే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని తీసుకొస్తానని ఓ నాయకుడు చెప్పాడని.. ఆయనే మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాడని పరోక్షంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. వారికి తమతో పనిలేదన్నారు. ఇక టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరికి తనను విమర్శించే స్థాయి లేదన్నారు. రాజయ్యను అడిగితే కడియం చర్రిత చెబుతాడన్నారు. తానెప్పుడు విదేశాలకు వెళ్లేది కేటీఆర్ను అడగాలని మీడియాకు సూచించారు. సోదరుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరినప్పటికీ.. తాను మాత్రం ప్రాణమున్నంత వరుక కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తేల్చి చెప్పారు.