సింగరేణి గొంతు కోస్తున్నవేళ భట్టికి బాధ లేదు, కిషన్రెడ్డికి రంది లేదు: భగ్గుమన్న కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో బొగ్గు గనుల వేలం అంశంపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి టార్గెట్ చేశారు. తెలంగాణ నేలపై సింగరేణి గొంతు కోస్తున్న వేళ డిప్యూటీ సీఎం భట్టి గారికి బాధ లేదు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి రంది లేదు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు కుట్రలకు నిలువెత్తు నిదర్శనం
తెలంగాణ ప్రజలపై వీరికి ప్రేమ లేదని, సింగరేణి కార్మికులపై అభిమానం లేదని విమర్శలు చేశారు. ఇద్దరికీ పట్టలేనంత సంతోషం.. మాటల్లో చెప్పలేనంత ఆనందం.. చిరునవ్వులు చిందిస్తున్న ఈ చిత్రమే వీరి కుమ్మక్కు కుట్రలకు నిలువెత్తు నిదర్శనం అంటూ ఒక ఫోటోను పోస్ట్ చేసి మరీ టార్గెట్ చేశారు.

పూల బొకేలతో నిస్సిగ్గుగా ఫోటోలకు ఫోజులా?
సింగరేణి వేలాది మంది కార్మికుల పొట్ట కొట్టి.. వందేళ్ళ సంస్థ భవిష్యత్తును చీకట్లోకి నెట్టి.. పూల బొకేలతో నిస్సిగ్గుగా ఫోటోలకు ఫోజులా అంటూ ప్రశ్నించారు కేటీఆర్. తెలంగాణ రాష్ట్ర సిరుల గనికి మరణ శాసనం రాస్తూ చిద్విలాసమా.. అంటూ ప్రశ్నించారు. వేలాదిమంది కార్మికుల జీవితాలతో చెలగాటమా అంటూ కేటీఆర్ భగ్గుమన్నారు.
ఫిరాయింపులు.. కుప్పిగంతులు అందుకేనా
ఈ "వేలం" వెర్రి నిర్ణయాల నుండి తెలంగాణ ప్రజల అటెన్షన్ డైవర్షన్ చేయడానికేనా బిఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంటికి వెళ్లి చేసిన ఫిరాయింపులు అంటూ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో పాలనా పగ్గాలు చేపట్టి ఆరు నెలలైనా గ్యారంటీలు అమలు చేయలేని అసమర్థత నుండి తప్పించుకునేందుకేనా ఈ కుప్పిగంతులు అంటూ ప్రశ్నించారు.
తెలంగాణ నేలపై..
— KTR (@KTRBRS) June 21, 2024
సింగరేణి గొంతు కోస్తున్న వేళ..
డిప్యూటీ సీఎం భట్టి గారికి బాధ లేదు..
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి రంది లేదు..
తెలంగాణ ప్రజలపై ప్రేమ లేదు..
సింగరేణి కార్మికులపై అభిమానం లేదు..
ఇద్దరికీ పట్టలేనంత సంతోషం..
మాటల్లో చెప్పలేనంత ఆనందం..
చిరునవ్వులు… pic.twitter.com/BzTut8FwHE
కాంగ్రెస్, బీజేపీ ఆడుతున్న వికృత క్రీడ ఇది
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణ రాష్ట్రం ఆగమైందని, ఇక దేశంలో బిజెపి నీతిలేని నిర్ణయాలలో కాంగ్రెస్ కూడా భాగమైందని మండిపడ్డారు. కాంగ్రెస్, బిజెపిలకు ప్రజలు వేసిన ఓటు తెలంగాణ జాతి ప్రయోజనాలకే గొడ్డలి పెట్టు అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమానికి పాతర వేసి, అభివృద్ధిని పాతాళానికి తొక్కేసి కాంగ్రెస్, బిజెపిలు ఆడుతున్న వికృత క్రీడ ఇది అంటూ కేటీఆర్ నిప్పులు చెరిగారు.
తెలంగాణ సహజ సంపదను చెరబట్టినందుకు చరిత్ర మిమ్మల్ని క్షమించదు
9 ఏళ్ళు కంటికి రెప్పలా కాపాడిన తెలంగాణ సహజ సంపదను చెరబట్టినందుకు కాంగ్రెస్, బిజెపిలను చరిత్ర ఎప్పటికీ క్షమించదని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. సింగరేణి వేలం ప్రక్రియ తెలంగాణ సహజ సంపదను చెరబట్టడమేనని కేటీఆర్ దీని ద్వారా తెలియజేశారు. జై తెలంగాణ, జై సింగరేణి అంటూ పేర్కొన్న ఆయన కాంగ్రెస్, బిజెపిలలో సింగరేణిని కాపాడే ఉద్దేశం లేదన్నారు.












Click it and Unblock the Notifications