జగన్ ఓటమిపై కేటీఆర్: వస్తువులా ప్రయోగించారు
KTR: భారత్ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్.. ఏపీ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. మొన్నటి ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమిపై తన అంచనాలను వెలిబుచ్చారు. అదే సమయంలో- ఏపీ, తెలంగాణల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలపైనా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడాన్ని తప్పుపట్టారు కేటీఆర్. పార్టీ ఫిరాయింపులపై రాహుల్ గాంధీ ఆస్కార్ రేంజ్లో నటిస్తోన్నారంటూ ఎద్దేవా చేశారు. జాతీయస్థాయిలో కాంగ్రెస్ ఎంపీలు పార్టీ ఫిరాయించడాన్ని తప్పుపడుతున్న రాహుల్ గాంధీకి.. తెలంగాణలో తాము చేస్తోన్న నిర్వాకం ఏమిటో తెలియదా? అంటూ ప్రశ్నించారు.

తాము మాత్రమే రాజ్యాంగాన్ని పరిరక్షిస్తోన్నామంటూ లోక్సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ.. తెలంగాణలో జరుగుతున్న ఫిరాయింపుల గురించి ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్నించారు. ఫిరాయింపుల వ్యవహారంపై తాము త్వరలోనే రాష్ట్రపతి, లోక్సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్ను కలుస్తామని అన్నారు.
సుప్రీంకోర్టు సహా ఢిల్లీలోని ప్రతి ఫోరంలోనూ ఈ అంశాన్ని లేవనెత్తుతామని కేటీఆర్ అన్నారు. ఫిరాయింపులకు చట్టపరమైన పరిష్కారాలపై నిపుణులను సంప్రదిస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్లో చేరిన తమ పార్టీ ప్రజా ప్రతినిధులందరూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఎంత డబ్బు ఇచ్చారంటూ కేటీఆర్.. రాహుల్ గాంధీని ప్రశ్నించారు. విలీనం అనేది ఫిరాయింపులకు భిన్నంగా ఉంటుందని, రాజ్యాంగబద్ధంగా మూడొంతుల మంది ఎమ్మెల్యేలు తమ పార్టీని బీఆర్ఎస్లో విలీనం చేశారని గుర్తు చేశారు.
ఏపీలో వైఎస్ జగన్ గెలుస్తున్నాడంటూ తమకు నివేదికలు వచ్చాయని, ఫలితాలు మాత్రం పూర్తి భిన్నంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.ఏం జరిగిందో అంతుపట్టట్లేదని కేటీఆర్ పేర్కొన్నారు. 2,70,000 కోట్ల రూపాయలను నేరుగా లబ్దిదారులకు అందజేసినా కూడా ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఆశ్చర్యాన్ని కలిగించాయని అన్నారు

రోజూ ప్రజల్లో ఉండే ధర్మావరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఓడిపోవడం ఏమిటని కేటీఆర్ పేర్కొన్నారు. అన్ని కూటములు కలిసి వచ్చినా కూడా జగన్కు 40 శాతం మేర ఓట్లు పోల్ కావడం సామాన్యమైన విషయం కాదని చెప్పారు. ప్రజలకు ఏం కావాలో, వాళ్ల పల్స్ పట్టుకోవడం ఎలాగో ఈ ఫలితాలు చూసిన తరువాత రాజకీయ నాయకులకు అర్థం కావట్లేదని చెప్పారు.
మొన్నటి ఎన్నికల్లో వైఎస్ షర్మిలను ఒక పావుగా వాడుకున్నారని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇక మీదట ఏపీ రాజకీయాల్లో షర్మిల ప్రభావం అనేది ఏ మాత్రం ఉండబోదని, ఆమె మరో కేఏ పాల్లా మారిపోయారని అన్నారు. ఎన్నికల ఫలితాల ఆధారంగా ప్రజలది తప్పు అనడం సరికాదని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
గ్రేటర్ హైదారాబాద్లో అన్ని సీట్లనూ తాము గెలిచిన విషయాన్ని గుర్తు చేశారు. చేసిన అభివృద్ధిని తాము చెప్పుకోలేకపోయామని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పేరు మార్చడం వల్ల ఓడిపోయామనడానికి ఆధారం లేదని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ విడిగా పోటీ చేసి ఉంటే ఫలితాలు మరో విధంగా ఉండేవని కేటీఆర్ చెప్పారు.












Click it and Unblock the Notifications