నిజమేనా?, కేసీఆర్ వ్యూహమా!: కేటీఆర్ సిరిసిల్లను వీడి అక్కడి నుంచి పోటీ చేస్తారా!
ఒకవేళ గ్రేటర్ నుంచి పోటీ చేయాల్సి వస్తే.. కూకట్పల్లి నుంచి కేటీఆర్ను బరిలో దింపాలని కేసీఆర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. తద్వారా గ్రేటర్లో పార్టీ మరింత బలోపేతం అవుతందనేది కేసీఆర్ ప్లాన్గా చెబుతు
హైదరాబాద్: ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయమున్నా.. తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ అప్పుడే భవిష్యత్తు ప్రణాళికను సిద్దం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అభ్యర్థుల బలబలాలను వారి బలహీనతలను బేరీజు వేసి ఎవరికి సీటు ఇవ్వాలి? ఎవరికీ సీటు ఇవ్వద్దు? అన్నదానిపై ఇప్పటినుంచే ఒక అంచనాకు వచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.
తాజా సర్వే లెక్కలను కూడా ఈ పరిశీలనలో కీలక భావిస్తున్నారట సీఎం కేసీఆర్. మూడేళ్ల పాలన తర్వాత ప్రభుత్వం పట్ల ఒకింత వ్యతిరేకత పెరిగిన నేపథ్యంలో.. ఎటువంటి వ్యూహాలను అవలంభించాలనే దానిపై ఆయన కసరత్తులు మొదలుపెట్టినట్లు చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ను గ్రేటర్ హైదరాబాద్ నుంచి రంగంలోకి దించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
గ్రేటర్లో ఎక్కడి నుంచి?:
కేసీఆర్ లాగే ఆకర్షణీయ ప్రసంగాల్లో చేయడంలో కేటీఆర్ ధిట్ట. మంచి వాక్చుతార్యంతో పాటు నాయకుడి గాను తనకంటూ సొంత ఇమేజ్ సంపాదించుకున్నారు. అటు సినీ పరిశ్రమకు చెందినవారితోను, ఇటు సెటిలర్స్ తోను సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఒకవేళ గ్రేటర్ నుంచి పోటీ చేయాల్సి వస్తే.. కూకట్పల్లి నుంచి కేటీఆర్ను బరిలో దింపాలని కేసీఆర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. తద్వారా గ్రేటర్లో పార్టీ మరింత బలోపేతం అవుతందనేది కేసీఆర్ ప్లాన్గా చెబుతున్నారు.
కేటీఆర్ ప్రభావం:
కేటీఆర్ ఎక్కడి నుంచి పోటీ చేసినా.. దాని ప్రభావం చుట్టుపక్కల నియోజకవర్గాల మీద కూడా ఉంటుంది కాబట్టి, గ్రేటర్ నుంచి ఆయన్ను బరిలో దింపడం పార్టీకి కలిసొస్తుందని కేసీఆర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఒకవేళ కూకట్ పల్లి నుంచి గనుక కేటీఆర్ రంగంలోకి దిగితే.. పక్కనే ఉన్న శేరిలింగంపల్లి నియోజకవర్గంపై దాని ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం శేరిలింగంపల్లి నియోజకవర్గానికి టీడీపీ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేటీర్ ఇక్కడి నుంచి పోటీ చేస్తే.. అక్కడ కూడా గులాబీ జెండా ఎగిరేయవచ్చుననేది టీఆర్ఎస్ ప్లాన్ గా తెలుస్తోంది.
సర్వేలో వెనుకబడ్డ మాధవరం:
ప్రస్తుతం కూకట్పల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తాజా సర్వేలో వెనుకబడిపోయారు. మొత్తం ఎమ్మెల్యేలందరిలో ఆయనే చివరిస్థానంలో ఉన్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయనకు టీఆర్ఎస్ టికెట్ దక్కుతుందా? అన్న అనుమానాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ను ఇక్కడి నుంచి బరిలోకి దింపి సెటిలర్లను పూర్తి స్థాయిలో తమ ఓటు బ్యాంకుగా మలుచుకోవాలని గులాబీ బాస్ కేసీఆర్ వ్యూహం రచిస్తున్నట్లుగా చెబుతున్నారు.
సెటిలర్లను టీఆర్ఎస్ వైపు నిలుపుకోవాలని :
వచ్చే ఎన్నికల్లో 111సీట్లు సాధిస్తామని కేసీఆర్ ధీమాగా చెబుతున్నారు. తెలంగాణ జిల్లాల్లో టీఆర్ఎస్ బలంగా ఉందని భావిస్తున్న ఆయన.. ఇక హైదరాబాద్లో పట్టు పెంచుకోవడమే తరువాయి అని భావిస్తున్నారు. ఈ మేరకే కేటీఆర్తో గ్రేటర్ రాజకీయాలను చక్కదిద్దాలని చూస్తున్నారు.
గత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో సెటిలర్లంతా టీఆర్ఎస్ కు పట్టం కట్టడంతో.. వచ్చే ఎన్నికల్లోను వారు టీఆర్ఎస్ వైపే నిలుస్తారని కేసీఆర్ భావిస్తున్నారు. కేటీఆర్ ను రంగంలోకి దింపడం ద్వారా అప్పటి ఎన్నికల్లో విజయం సాధించడంతో.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోను దాని రిపీట్ చేయాలనే యోచనలో ఉన్నారు.