అమెరికా నుంచి ఎందుకు తిప్పి పంపిస్తున్నారు: కెటిఆర్ ఆరా, కవితకు దత్తాత్రేయ కౌంటర్
హైదరాబాద్: అమెరికా కాన్సులేట్ జనరల్ మైఖేల్ ముల్లిన్స్తో తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం భేటీ అయ్యారు. అమెరికా నుంచి తెలుగు విద్యార్థులను తిప్పి పంపిన అంశంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
బేగంపేటలో ఉన్న అమెరికన్ కాన్సులేట్లో ముల్లిన్ను కలిసిన కెటిఆర్ పలు అంశాలపై చర్చించారు. అమెరికాలో తెలంగాణ విద్యార్థులు ఎదుర్కొంటోన్న సమస్యలపై చర్చించారు. అనంతరం కెటిఆర్ మాట్లాడారు. అమెరికా వెళ్లి చదువుకోవాలనుకునే విద్యార్థుల విషయమై ప్రభుత్వం చొరవ తీసుకుంటుందన్నారు.
వెనక్కి వచ్చిన విద్యార్థుల్లో హైదరాబాదలో ఎక్కవ, ఫేక్ డాక్యుమెంట్లతో వెళ్లే వారిని అక్కడే అడ్డుకోవాలి, ఆమెరికా నుంచి వెనక్కి వచ్చిన విద్యార్థులలో హైదరాబాద్ వాళ్లే ఎక్కువగా ఉన్నారని చెప్పారు. ఫేక్ డాక్యుమెంట్లతో వెళ్లే వారిని ఇక్కడే అడ్డుకోవాలన్నారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకే తాను సమస్య పరిష్కారానికి వచ్చానని చెప్పారు. సమస్య పరిష్కారానికి అమెరికన్ అధికారులు కూడా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఈ విషయమై విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్కు లేఖ రాస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు.
కాగా, ఉన్నత చదువుల కోసం భారీ సంఖ్యలో అమెరికా వెళుతున్న తెలుగు విద్యార్థుల్లో కొందరు నకిలీ ధ్రువపత్రాలు సమర్పిస్తున్నారా? ఇదే అనుమానంతో అమెరికా కాన్సులేట్ల నుంచి విద్యార్హతల ధ్రువపత్రాలకు సంబంధించి ప్రతినెలా పదుల సంఖ్యలోనే జేఎన్టీయూహెచ్కు పరిశీలన కోసం పంపుతున్నారు.
అమెరికాలో చదివేందుకు పోటీపడుతున్న తెలుగు విద్యార్థులు ఏటేటా పెరిగిపోతున్నారు. తాము చదివిన డిగ్రీ కోర్సుల్లో బ్యాక్లాగ్లను, ఉత్తీర్ణత శాతాన్ని కప్పిపుచ్చేందుకు పలువురు తప్పుడు మార్గాలను ఎంచుకుంటున్నారు.
వీటిపై అమెరికా కాన్సులేట్ల అధికారులు కొద్ది సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో నకిలీ ధ్రువపత్రాల తయారీని అడ్డుకునేందుకు జేఎన్టీయూహెచ్ ధ్రువపత్రంలో ఎలక్ట్రానిక్ చిప్ను కూడా చేర్చింది.
అయినప్పటికీ ఆయా సర్టిఫికెట్లు అసలైనవా? నకిలీవా? అని అమెరికా అధికారులు జేఎన్టీయూహెచ్కు పంపిస్తున్నారు. కొన్ని జేఎన్టీయూ కాకినాడ, అనంతపురానికి చెందినవి ఉన్నా ఇక్కడికే పంపిస్తున్నారు. జేఎన్టీయూహెచ్ సర్టిఫికెట్లకు సంబంధించి ఏజెన్సీలకు వేగంగా సమాచారం ఇచ్చేందుకు సాఫ్ట్వేర్ను రూపొందించుకొని ఆన్లైన్లో నిర్ధారణ చేస్తోంది.
కవిత వ్యాఖ్యలకు దత్తాత్రేయ కౌంటర్
తెలంగాణకు దత్తాత్రేయ, కిషన్ రెడ్డిలు రూ.20వేల కోట్ల ప్యాకేజీ తీసుకు వస్తే తాను కూడా బిజెపికి ఓటు వేస్తానన్న తెరాస ఎంపీ కల్వకుంట్ల కవితకు కేంద్రమంత్రి, బిజెపి నేత బండారు దత్తాత్రేయ సోమవారంకౌంటర్ ఇచ్చారు.
నిధులు, అభివృద్ధి, ఓట్లు.. ఈ మూడు వేర్వేరు అంశాలని కవితకు హితవు పలికారు. తెలంగాణకు కేంద్రం ఎన్నో నిధులు కేటాయించిందన్నారు. తాజాగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ రూ.43వేల కోట్ల ప్రాజెక్టులు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు రూ.48వేల ఇళ్లు, డబుల్ బెడ్ రూం ఇళ్లకు హడ్కో రూ.3వేల రుణం ఇచ్చిందన్నారు.
మెట్రో రైలు ప్రాజెక్టు పూర్తి చేస్తే ప్రధాని నరేంద్ర మోడీ వస్తారని, ప్రారంభిస్తారని చెప్పారు. రామగుండం ఎన్టీపీసీకి, ఎరువుల కర్మాగారం ప్రారంభోత్సవాలకు వస్తారని చెప్పారు.
హిందుత్వవాదులు ఏకం కావాలి: రాజాసింగ్ లోథ్
జిహెచ్ఎంసీ ఎన్నికల్లో హిందుత్వవాదులు ఏకం కావాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథ్ అన్నారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న మజ్లిస్, తెరాస పార్టీలకు బుద్ధి చెప్పాలని ఆయన హైదరాబాద్ ప్రజలకు పిలుపునిచ్చారు.