1నుంచే, మన టీవీతో అందరికీ లాభమే: ఇస్రోతో ఒప్పందం
హైదరాబాద్: భారత ప్రతిష్టను ఇస్రో అన్ని దేశాల ముందు చాటుతోందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. 'మన టీవీ' ద్వారా తెలంగాణలో విద్యార్థులకు పోటీ పరీక్షలకు శిక్షణనిచ్చే కార్యక్రమంపై ఇస్రోతో కుదుర్చుకున్న ఎంవోయూపై కేటీఆర్ సమక్షంలో బుధవారం అధికారులు సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇస్రో అందిస్తున్న పరిజ్ఞానంతో మనటీవీ ద్వారా పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు శిక్షణనిచ్చే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
రోజుకి నాలుగు గంటల సమయం ఈ శిక్షణ కార్యక్రమం ఉంటుందని కేటీఆర్ చెప్పారు. ప్రతి రోజు ఉదయం రెండు గంటలు, సాయంత్రం రెండు గంటలు శిక్షణ కొనసాగుతుందని ఆయన అన్నారు. దీని వల్ల ఎందరో విద్యార్థులు లాభపడతారని పేర్కొన్నారు. అన్ని వర్గాలకు మనటీవీ కార్యక్రమాలు అందేలా చూస్తామని చెప్పారు.
అక్టోబర్ 1 నుంచి మన టీవీ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, గ్రూప్-2 అభ్యర్థుల శిక్షణా కార్యక్రమాలు కూడా అనాటి నుంచి ప్రసారమవుతాయని ఆయన చెప్పారు. అక్టోబర్ 14 నుంచి తెలంగాణలోని ఆరు వేల స్కూళ్లలో డిజిటల్ పాఠాలు కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు. మన టీవీ ద్వారా ఎంసెట్ విద్యార్థులకు కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
గ్రూప్ పరీక్షలతోపాటు ఐఏఎస్, ఐపీఎస్ పరీక్షలకు పోటీ పడే అభ్యర్థులకు కూడా ఉపయోగపడే శిక్షణ మన టీవీ ద్వారా అందజేయడం జరుగుతుందని మంత్రి కేటీఆర్ చెప్పారు. తెలంగాణలో పోటీ పరీక్షలను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు.
దేశంలో టీఎస్ పీఎస్సీ ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. మన టీవీ ప్రసారాల ద్వారా 90లక్షల మంది ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి కేటీఆర్ వివరించారు. విద్యార్థులకే కాకుండా రైతులకి కూడా ఆధునిక వ్యవసాయ పద్ధతులపై శిక్షణనిచ్చే కార్యక్రమాలు చేపడతామని చెప్పారు.