అయ్యా! ఈ పార్టీలతో మావల్ల కాదు, మీరు రండి అంటున్నారు: జగన్-బాబులపై కేటీఆర్!
షాద్ నగర్: సమైక్య రాష్ట్రంలో పాలమూరు జిల్లా దగాపడిందని మంత్రి కేటీఆర్ అన్నారు. పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. షాద్ నగర్ నియోజకవర్గంలో మంత్రులు కేటీఆర్, మహేందర్ రెడ్డి, లక్ష్మీరెడ్డిలు పర్యటించారు. రూ.67 కోట్లతో కొత్తూరులో రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించారు.
తెలంగాణలో ఏంజరుగుతోంది: అసెంబ్లీ రద్దుపై బాబు ఆరా, కేసీఆర్కు ధీటుగా!
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. కేసీఆర్ పాలనను పొరుగు రాష్ట్రాలు కూడా మెచ్చుకుంటున్నాయని చెప్పారు. పొరుగు రాష్టమైన ఏపీ కూడా గతంలో కొందరు నేతలు చేసిన తప్పుడు ప్రచారంతో అపార్థం చేసుకున్నారని, ఇప్పుడు ఇక్కడి అభివృద్ధి చూసి ఇలాంటి పాలన కోరుకుంటున్నారని తెలిపారు.
కొత్త రాష్ట్రమైనా ఇంత బాగా ఎలా చేస్తున్నారని చూసిపోతున్నారు
అన్ని కులాలకు, అన్ని మతాలకు గౌరవం ఇచ్చే సీఎం, పేదవాడిని కడుపులో పెట్టుకొని చూసుకునే సీఎం మన కేసీఆర్ అని కేటీఆర్ అన్నారు. దేశం మొత్తం, ఇతర రాష్ట్రాల సీఎంలు, ఇతర రాష్ట్రాల ప్రతినిధులు పలు సందర్భాల్లో మాట్లాడుతూ.. కొత్త రాష్ట్రమైనప్పటికీ వీరు ఇంత బాగా ఎలా చేస్తున్నారని ఇక్కడకు వచ్చి చూసిపోతున్నారని చెప్పారు.
అయ్యా, ఏపీ పార్టీలతో మా వల్ల కాదు, మీరు రండి
పక్క రాష్ట్ర ప్రజలు కూడా తమకు ఇలాంటి ప్రభుత్వం ఉంటే బాగుండునని కోరుకుంటున్నారని కేటీఆర్ తెలిపారు. మాకు ఇలాంటి సీఎం ఉంటే బాగుండు, ఇలాంటి మంత్రులు ఉంటే బాగుండునని కోరుకుంటున్నారని చెప్పారు. మరో అడుగు ముందుకేస్తే.. అప్పటి నాయకులు చేసిన దుష్ప్రచారం వల్ల ఏపీ ప్రజలు మనలను, మన ఉద్యమాన్ని అపార్థం చేసుకున్నారని, సామాన్యులైన ఏ ఆంధ్రా ప్రజలు అపార్థం చేసుకున్నారో, అనుమానించారో.. ఆ ఆంధ్రా ప్రజలు మనలను పిలుస్తున్నారని చెప్పారు. అయ్యా.. టీఆర్ఎస్ పార్టీని ఆంధ్రలో కూడా పెట్టండి. ఇక్కడున్న పార్టీలతో మా వల్ల కాదని, మాకు వద్దని చెబుతున్నారని, అక్కడి ప్రజలు పిలుస్తున్నారని, దీనిని బట్టే కేసీఆర్కు ఉన్న జనామోదం చెప్పవచ్చునని అన్నారు. ప్రస్తుతం ఏపీలో టీడీపీ, వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలు ప్రధానంగా ఉన్నాయి. వాటిని ఉద్దేశించి కేటీఆర్ అన్నారు.
కేసీఆర్ మనవళ్లు తినే బియ్యమే విద్యార్థులకు
రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ కేటీఆర్ అన్నారు. దేశమంతా తెలంగాణ ప్రభుత్వ పాలనను ప్రశంసిస్తోందని చెప్పారు. పక్క రాష్ట్రాల ప్రజలు కూడా కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోను టీఆర్ఎస్ పార్టీ పెట్టాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. నాటి పాలకుల వల్లే పాలమూరుకు ఈ దుస్థితి వచ్చిందని చెప్పారు. రైతులకు ఉచితంగా 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు. ఈ దేశంలో ఎవరు ఇచ్చినా, ఇవ్వకున్నా తెలంగాణలో మాత్రం పేదవాడికి రూ.1500 పింఛన్ ఇస్తోందన్నారు. ఇందుకోసం రూ.5600 కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు. నాడు కాంగ్రెస్ ఇచ్చిన దాని కంటే ఆరేడు రెట్లు ఇస్తున్నామని చెప్పారు. కేసీఆర్ మనవడు, మనవరాలు ఇంట్లో ఏ బియ్యం తింటున్నారో, హాస్టళ్లలో కూడా అదే భోజనం పెడుతున్నారని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధిస్తున్నామన్నారు. ఒక్కో విద్యార్థి మీద రూ.1.20వేలు ఖర్చు చేస్తున్నామన్నారు. ఇంగ్లీష్ మీడియాలో బ్రహ్మాండమైన విద్య అందిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో మండలానికి ఓ గురుకుల పాఠశాల పెడతామన్నారు.
మెరుపు వ్యూహంతో సిద్ధం
ఎన్నికలకు మెరుపు వ్యూహంతో సిద్ధంగా ఉన్నామని మరో మంత్రి కేటీఆర్ హుస్నాబాద్లో అన్నారు. హుస్నాబాద్ వేదికగా ఎన్నికల సమరభేరీ మోగిస్తామని చెప్పారు. రాజకీయ అజెండా లక్ష్యంగానే కేసీఆర్ ప్రసంగం ఉంటుందని చెప్పారు. ప్రగతి నివేదన సభపై ప్రతిపక్షాలు పిచ్చికూతలు కూస్తున్నాయని చెప్పారు.