ప్రియుడ్నే చేసుకుంటా: మధుప్రియ, వదిలేసిన పేరెంట్స్, పెళ్లికి లైన్ క్లియర్.. సాయంత్రమే
అదిలాబాద్: ఆడపిల్లనమ్మా అనే పాట ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గాయని మధుప్రియ ప్రేమ పెళ్లికి లైన్ క్లియర్ అయింది. శుక్రవారం నాడు మధుప్రియకు, ఆమె ప్రియుడు శ్రీకాంత్కు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.
మధుప్రియ పెళ్లికి ఆమె తల్లిదండ్రులు నో చెప్పారు. పోలీసుల కౌన్సెలింగ్లో మధుప్రియ... ఎట్టి పరిస్థితుల్లోను తాను ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని తేల్చి చెప్పింది. ఆమె మేజర్ అయినందు వలన తల్లిదండ్రులకు నచ్చచెప్పారు. దీంతో మధుప్రియ ప్రేమపెళ్లికి లైన్ క్లియర్ అయింది.
శుక్రవారం ఉదయం నుంచి మధుప్రియ, తల్లిదండ్రులు కాగజ్ నగర్ పోలీసు స్టేషన్లో ఉన్నారు. తల్లిదండ్రులు ఎంత నచ్చచెప్పినా మధుప్రియ వినలేదు. పోలీసులు ఇరు కుటుంబాలను పిలిచి మాట్లాడారు.
కెరీర్ పైన దృష్టి పెట్టాలని మధుప్రియ తండ్రి తన కూతురుకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఆమె అసలు వినలేదు. ఆ తర్వాత నవంబర్ 18న పెళ్లి చేసేందుకు అంగీకరించారు. అయితే, తాను వెంటనే శ్రీకాంత్ను పెళ్లి చేసుకుంటానని చెప్పింది. దీంతో తల్లిదండ్రులు ఆమెను వదిలేసి వెళ్లిపోయారు.
దీంతో, ఉదయం పదకొండున్నర గంటలకు కావాల్సిన పెళ్లి... సాయంత్రం సిర్పూర్ కాగజ్ నగర్లోని వాసవీ గార్డెన్స్లో జరగనుంది. ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పెళ్లికి తల్లిదండ్రులు హాజరు కావడం లేదని సమాచారం.
కాగా, గాయని మధుప్రియ శుక్రవారం ప్రియుడు శ్రీకాంత్ను వివాహం చేసుకనేందుకు ప్రయత్నాలు చేసిన సమయంలో... ఆమెను కిడ్నాప్ చేసేందుకు యత్నించినట్లుగా వార్తలు వచ్చాయి. కిడ్నాప్ యత్నం నుంచి తప్పించుకుని మధుప్రియ ఆదిలాబాద్ జిల్లా కాగజ్నగర్ చేరుకుంది.
మధుప్రియ, ప్రియుడు పోలీసు స్టేషన్ చేరుకున్నారు. తల్లిదండ్రులు వారు ప్రేమ పెళ్లికి అంగీకరించకపోవడంతో పోలీసులు మధుప్రియకు కౌన్సెలింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే మధుప్రియ ప్రియుడినే పెళ్లి చేసుకుంటానని తేల్చి చెప్పింది.
మధుప్రియ ఇంటర్ పూర్తి చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో మధు ప్రియ గాయనిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. తల్లిదండ్రులు పెద్దింటి మల్లేశ్, సుజాత. తల్లితండ్రులకు ముగ్గురు ఆడసంతానం. అందులో రెండవ అమ్మాయి మధుప్రియ.
గాయకురాలుగా తను ఐదవతరగతి చదువుతున్నప్పుడే "ఆడపిల్లనమ్మ" పాటతో చిన్న వయస్సులోనే మంచి పేరు తెచ్చుకుంది. పెద్దింటి మధుప్రియ తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో 26 ఆగస్టు 1997న పుట్టింది. గత ఐదు రోజులుగా కాగజ్నగర్లోనే మధుప్రియ ఉంటోంది. శుక్రవారం ఉదయం 11.20 గంటలకు కాగజ్నగర్ వాసవీ గార్జెన్లో ఆమె వివాహం జరగాల్సి ఉండెను.