రాజకీయాలతో సంబంధం లేదు: కెటిఆర్ని కల్సిన రాజేంద్రప్రసాద్, 'గ్రేటర్' కోసమా?
హైదరాబాద్: తనకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని 'మా' (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ శుక్రవారం నాడు చెప్పారు. ఆయన తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుతో భేటీ అయ్యారు.
త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాజేంద్ర ప్రసాద్ మంత్రి కెటిఆర్ను కలవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే కెటిఆర్తో భేటీ అనంతరం రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. రాజకీయాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.
తమ సంస్థకు (మా)కు అవసరమైన కార్యకలాపాల పైన మంత్రి కెటిఆర్తో చర్చించానని చెప్పారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. అయితే, రాజకీయాలకు సంబంధం లేదని స్పష్టం చెప్పారు. గతంలో మా అధ్యక్ష ఎన్నికల సమయంలోను తలసాని శ్రీనివాస్ యాదవ్ సహకరించినట్లుగా చెప్పారు.
కాగా, రాజకీయాలతో సంబంధం లేదని చెప్పినప్పటికీ.. గ్రేటర్ ఎన్నికల సమయంలో రాజేంద్ర ప్రసాద్ మంత్రి కెటిఆర్ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే గ్రేటర్ ఎన్నికల్లో సీమాంధ్రుల ఓట్ల కోసం, సినిమా వారి ఓట్ల కోసం అధికార టిఆర్ఎస్ రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా రాజేంద్ర ప్రసాద్ కలిశారా అనే చర్చ సాగుతోంది.