మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం... ఎందుకో తెలుసా!!
సాధారణంగా సినీ తారల చిత్రపటాలకు, రాజకీయ నాయకుల ఫోటోలకు అభిమానులు పాలాభిషేకాలు చేస్తుంటారు. కానీ దీనికి భిన్నంగా ఓ జిల్లా కలెక్టర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. అసలు ఇంతకీ మహబూబాబాద్ జిల్లాలో కలెక్టర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిందెవరు? దీనికి కారణం ఏంటి అంటే..
స్కూల్ తెరిపించిన కలెక్టర్ కు పాలాభిషేకం
మహబూబాబాద్ పట్టణంలోని శ్రీరామ్ నగర్ దీప్తి కాలనీలో మూడేళ్లుగా ప్రభుత్వ పాఠశాల మూతబడి ఉంది. 2018లో విద్యార్థులు తక్కువగా ఉన్నారన్న కారణంతో మూసివేతకు గురైన ఈ పాఠశాలను , స్థానిక ప్రజల విజ్ఞప్తి మేరకు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక మళ్లీ తెరిపించారు. దీంతో స్కూలు తెరుచుకోవడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తూ కలెక్టర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తమ చిన్నారుల బంగారు భవిష్యత్ కు భరోసా దొరికిందని వారంటున్నారు.
విద్యార్థులు లేరని స్కూల్ మూసివేత ..స్థానికుల విజ్ఞప్తితో కలెక్టర్ చొరవ
కలెక్టర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. సోమవారం స్థానిక జిల్లా కేంద్రంలోని శ్రీరాం నగర్ బిసి కాలనీలో నిర్వహించిన ఈకార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి శంతన్ రామరాజు తదితరులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి శంతన్ రామరాజు మాట్లాడుతూ ఇరవై అయిదేండ్లకు పైగా విద్యబుద్దులు నేర్పిన పాఠశాలను విద్యార్థులు తక్కువ ఉన్నారనే నెపంతో ప్రభుత్వం మూసి వేసిందని పేర్కొన్నారు.
విద్యా, వైద్య రంగాలను సేవారంగాలుగా చూడాల్సిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వందలాది పాఠశాలలను ఇదే కారణంతో ఎత్తివేసి చదువు 'కొనలేని" విద్యార్థులకు విద్యను దూరం చేసిందని పేర్కొన్నారు. మళ్ళీ పాఠశాల తెరవాలని నాటి కలెక్టర్ కు , జిల్లా విద్యాశాఖ అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకపోయిందని పేర్కొన్నఆయన ప్రస్తుత కలెక్టర్ పాఠశాలను తెరిపించటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
ప్రైవేట్ స్కూల్స్ లో చదివించలేక ఇబ్బంది
కరోనా కాలంలో ఆర్థికంగా చితికి పోయిన ఎన్నో కుటుంబాలు తమ పిల్లలను ప్రయివేటు పాఠశాలల్లో చేర్పించలేక ఇబ్బందులు పడుతున్నారని ఈ సమయంలో కలెక్టర్ తీసుకున్న చొరవతో విద్యార్థులకు బడి కష్టాలు తప్పవు అని పేర్కొన్నారు . కాలనీ వ్యాప్తంగా ముప్పై మందికి పైగా చిన్నారులు తల్లిదండ్రుల అలనాపాలన లేక చెరువులు, కాలువల వెంబడి తిరిగి ప్రమాదాలకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
స్కూల్ తెరుచుకోవటంతో తల్లిదండ్రుల్లో ఆనందం
ఒకవైపు చదువు లేకపోగా మరోవైపు చిన్నారుల బ్రతుకుకు భద్రత లేకపోవడంతో ఎలాగైనా మూసివున్న పాఠశాలను తెరవాలంటూ విద్యార్థులు తల్లిదండ్రులు అంతా కలిసి మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కు విన్నవించుకున్నామని పేర్కొన్న తల్లిదండ్రులు సానుకూలంగా స్పందించి ఈరోజు ఉపాధ్యాయులను పంపించి పాఠశాలను తిరిగి తెరిపించారని వారు సంతోషం వ్యక్తం చేశారు.
పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసిన కలెక్టర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి మా ఆనందాన్ని, కృతజ్ఞతను తెలియజేసుకున్నాం అని అన్నారు. ఏదేమైనా మానుకోట జిల్లాకు ఇంతమంచి కలెక్టర్ ఉండటం సంతోషదాయకమని వారు పేర్కొన్నారు. పాఠశాలను తిరిగి తెరవడానికి సహకరించిన డిఈవో, ఎం ఈ.వోలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని వెల్లడించారు.ఇంకా ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.