'తెలంగాణలో కరువు': ప్లీనరీలో కేసీఆర్ అందమైన అబద్ధాలు చెప్పారా?
హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ప్లీనరీపై కాంగ్రెస్ నేతలు విమర్శనాస్త్రాలు సంధించారు. ప్లీనరీలో ముఖ్యమంత్రి కేసీఆర్ అందమైన అబద్ధాలు ఆడుతూ ప్రజలను మభ్య పెడుతున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు.
గురువారం ఖమ్మం డీసీసీ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు కరవుతో అల్లాడుతుంటే టీఆర్ఎస్ ప్లీనరీల పేరుతో పండగ చేసుకుంటోందని ధ్వజమెత్తారు. ఖమ్మం జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ప్లీనరీ సభలో హామీలు గుప్పించారని మండిపడ్డారు.
ప్రాజెక్టుల నిర్వహణ రీడిజైనింగ్ పేరుతో అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పవర్పాయింట్ ప్రజెంటేషన్ లోపాలపై కాంగ్రెస్ పార్టీ తగిన సమయంలో స్పందిస్తుందని చెప్పారు. రీడిజైనింగ్ పేరుతో కోట్లాది రూపాయల నిధులను కొల్లగొట్టడమే లక్ష్యంగా టీఆర్ఎస్ పనిచేస్తోందని ఆరోపించారు.

ప్లీనరీపై కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ
తెలంగాణలోని ప్రజలు తీవ్రమైన కరువు సమస్యతో అల్లాడుతుంటే సీఎం కేసీఆర్ దాన్ని పట్టించుకోకుండా పార్టీ ప్లీనరీని ఘనంగా జరపడం దారుణమని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరువు సహాయక చర్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.
కేసీఆర్ తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుందని ఎద్దేవా చేశారు. ప్లీనరీ ప్రజలకు భరోసా కల్పించకుండా పార్టీ కార్యకర్తలకు మాత్రం భరోసా ఇచ్చిందని తెలిపారు. కేసీఆర్కు కాంగ్రెస్ నేతలకు కండువా కప్పే తీరిక ఉంది కానీ రాష్ట్రంలో కరువు తీర్చే తీరిక లేదని షబ్బీర్ అలీ మండిపడ్డారు.












Click it and Unblock the Notifications