చేసుకుంది ప్రేమ పెళ్లి: మరో మహిళతో సంబంధం పెట్టుకుని భర్యను చంపేశాడు
ఖమ్మం: చేసుకుంది ప్రేమపెళ్లి. మద్యానికి బానిసయ్యాడు. భార్యను అదనపు కట్నం కోసం నిత్యం వేధిస్తూ వచ్చాడు. చివరకు మరో మహిళతో సంబంధం పెట్టుకుని ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను హతమార్చాడు. ఈ ఘటనఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెంలో జరిగింది.
అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యలో సహకరించిన కుటుంబ సభ్యులను ఖమ్మం డీఎస్పీ దక్షిణమూర్తి రిమాండ్కు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ వెల్లడించారు.
వరంగల్ జిల్లా మరిపెడ మండలం నెలికుర్తి గ్రామానికి చెందిన స్వాతి(25)కి మండలంలోని బూడిదంపాడుకు చెందిన బత్తుల నవీన్తో నాలుగేళ్ల క్రితం కులాంతర వివాహం జరిగింది. ఇందుకు స్వాతి తల్లిదండ్రులు రూ.5లక్షల నగదు, అరెకరం పొలం వరకట్నంగా నవీన్కు ఇచ్చుకున్నారు. అయితే నవీన్ మద్యానికి బానిసై అదనపు కట్నం తేవాలంటూ స్వాతిని తరచూ వేధిస్తుండేవాడు.
దానికితోడు నవీన్ తనకు బంధువైన మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని స్వాతిని వదిలించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. భార్యాభర్తల మధ్య ఏర్పడిన వివాదంపై అనేకమార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీలు జరిగాయని, చివరికి కామేపల్లి మండలం తాళ్లగూడెం పోలీస్ స్టేషన్లో తన భర్త ప్రవర్తనపై స్వాతి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
దీనిపై విచారణ చేపట్టిన కామేపల్లి పోలీసులు నవీన్ తప్పును గమనించి కౌన్సెలింగ్ ఇచ్చి ఇద్దరూ వేరే కాపురం పెట్టే విధంగా చేశారు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం భార్యాభర్తలిద్దరూ మంచుకొండలో ఓ గదిని అద్దెకు తీసుకొని ఉంటున్నట్లు చెప్పారు. అయినా నవీన్లో ఏ మాత్రం మార్పు రాకపోగా, మరో మహిళతో ఉన్న అక్రమ సంబంధంతో స్వాతిని అదనపు కట్నం తేవాలంటూ మళ్లీ వేధింపులకు గురి చేస్తూ ఉండేవాడని డీఎస్పీ వివరించారు.
ఈ నెల 12న రాత్రి 9.30గంటల సమయంలో నవీన్ మద్యం సేవించి ఇంటికి రాగా నిద్రలో ఉన్న స్వాతి నోటికి అడ్డంగా దిండు పెట్టి గొంతు నులిమి హత్య చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ విషయాన్ని నవీన్ తన స్పేహితుడు జర్పుల రవికి తెలపడంతో రవి వెంటనే నవీన్ అన్న నాగుకు విషయం తెలియజేసి వెంట పెట్టుకొని వచ్చాడన్నారు. వారి రాకను గమనించిన నవీన్ అక్కడి నుంచి ఉడాయించినట్లు చెప్పారు.
దీంతో రవి, నాగులు స్వాతి మృత దేహాన్ని మాయం చేసే క్రమంలో ఇంటి యజమాని గుర్తించి వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. పరారీలో ఉన్న నవీన్ ఉదయం ఇంటికి చేరుకోగా దాడి చేసి పట్టుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. అంతేకాక వరకట్న వేధింపుల్లో బాద్యులైన నిందితుని తల్లిదండ్రులు సులోచన, ఆంజేయులు, చెల్లి, బావ లావణ్య, కోటేశ్వరరావు, అన్నా, వదిన నాగు, కరుణ, హత్యకు సహకరించిన స్నేహితుడు రవిలను సైతం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.