కోటీశ్వరుడినంటూ మూడో పెళ్లికి రెడీ: రూ.40 లక్షలు కట్నం
హైదరాబాద్/ నల్లగొండ: ఓ నిత్య పెళ్లికొడుకును హైదరాబాదు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ రెయిన్బజార్లో చోటుచేసుకుంది. మూడో పెళ్లికి సిద్ధమైన మహ్మద్ అహ్మద్ అలీని పోలీసులు అరెస్ట్ చేశారు.
కోటీశ్వరుడినంటూ వధువు తల్లిదండ్రుల నుంచి రూ. 40 లక్షలను కట్నంగా తీసుకున్నాడు. మహ్మద్ అహ్మద్అలీని బందువులు గుర్తించి నిలదీశారు. దాంతో అతని బండారం బయపడింది.
పూల మార్కెట్లో అగ్నిప్రమాదం
హైదరాబాద్ నగరంలోని గుడిమల్కాపుర్ పూల మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ దుకాణంలో మంటలు చెలరేగాయి. ఈ మంటలు చుట్టుపక్కల దుకాణాలకు కూడా వ్యాపించాయి. దీంతో 20 దుకాణాలు మంటల్లో చిక్కుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం.
దారుణహత్య
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో దారుణహత్య జరిగింది. పట్టణంలోని ఈదులగూడ ప్రాంతంలో లారీలో నిద్రిస్తున్న ఓ వ్యక్తిని కొందరు దుండగులు గొంతుకోసి హతమార్చారు. మృతుడు సాయిప్రసాద్ ఏపీలోని కృష్ణాజిల్లా జగ్గయ్యపేటకు చెందిన వ్యక్తిగా గుర్తింపు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.