కల్తీ కల్లు దొరక్క పిచ్చి చేష్టలు: బీడి వెలిగించబోయి వ్యక్తి సజీవదహనం, మహిళ ఆత్మహత్య
హైదరాబాద్: కల్తీ కల్లుకు అలవాటు పడి అది లభించకపోవడంతో పిచ్చిగా వ్యవహరిస్తున్నవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. కల్తీ కల్లు దొరక్క మతిస్తిమితం కోల్పోయి గ్యాస్ తెరిచి ఉందని గమనించక బీడీ వెలిగించడానికి ప్రయత్నించిన వ్యక్తి సజీవ దహనమయ్యాడు. ఈ సంఘటన మహబూబ్నగర్ జిల్లా నర్వ మండలం కొంకణివారిపల్లి గ్రామంలో బుధవారంనాడు జరిగింది.
గ్రామానికి చెదిన రవీందర్ రెడ్డి (39) గత కొన్నేళ్లుగా కల్తీ కల్లుకు బానిసయ్యాడు. ఈ క్రమంలో బుధవారంనాడు కుటుంబ సభ్యులు కూలీ పనులకు వెళ్లగా గుడిసెలో నిద్రిస్తున్న రవీందర్ రెడ్డి బీడీ వెలిగించుకోవడానికి ప్రయత్నించాడు. అప్పటికే ఇంట్లో ఉన్న వంట గ్యాస్ ఆన్ చేసి ఉంది. దాంతో ఇంట్లో గ్యాస్ వ్యాపించి ఉంది.
దాన్ని గమనించని రవీందర్ రెడ్డి బీడీ వెలిగించుకోవడానికి ప్రయత్నించాడు. దాంతో గుడిసెకు మంటలు అంటుకున్నాయి. ఈ మంటల్లో చిక్కుకుని రవీందర్ రెడ్డి సజీవదహనమయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలావుంటే, కల్తీ కల్లుకు బానిస అయిన ఓ మహిళ అది దొరకకపోవడంతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ సంఘటన కూడా అదే గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన బోయ బుచ్చమ్మ (48) గత కొంత కాలంగా కల్తీ కల్లుకు అలవాటు పడింది.
వారం రోజులుగా కల్లు లభించకపోవడంతో మతిస్తిమితం కోల్పోయినట్లు ప్రవర్తిస్తూ మంగళవారం రాత్రి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. స్థానికులు అంబులెన్స్ సాయంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె బుధవారంనాడు మరణించింది.