గత జన్మలో నువ్వు నా భార్యవు, ముగ్గురం కాపురం చేద్దాం: ఉద్యోగినికి వేధింపులు
Recommended Video
హైదరాబాద్: పూర్వ జన్మలో నువ్వు నా భార్యవు అంటూ ఒడిశాకు చెందిన ఓ కవి ఓ మహిళను వేధిస్తున్నాడు. నా భార్యతో పాటు ముగ్గురం కాపురం చేద్దామంటూ సోషల్ మీడియాలోను పోస్టులు పెట్టాడు. సదరు కవి ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగినిని ఇలా వేధింపులకు గురి చేస్తున్నాడు. అతను కూడా ప్రభుత్వ సంస్థలో ఉన్నతాధికారే కావడం గమనార్హం.
ఓ కవి సమ్మేళనం సందర్భంగా పరిచయమైన ఉద్యోగినిని అతను వేధిస్తున్నాడు. బాధితురాలు హైదరాబాద్ పోలీసులకు మొరపెట్టుకుంది. దీంతో విషయం వెలుగు చూసింది.
కవి సమ్మేళనంలో ఆమెతో పరిచయం
ఒడిశాకు చెందిన ఓ కవి కేరళలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. తన కవితలతో ప్రసిద్ధి చెందిన ఆయన గతంలో రాజేంద్రనగర్లోని ఓ కేంద్ర ప్రభుత్వ సంస్థలో జరిగిన కవి సమ్మేళనానికి కొంతకాలం క్రితం వచ్చాడు. ఈ సమయంలో అదే కవి సమ్మేళనానికి హాజరైన ఉద్యోగినితో పరిచయం ఏర్పడింది. అతను ఆమెతో పరిచయాన్ని పెంచుకుంటూపోయాడు.
గత జన్మలో భార్య, ఇప్పుడు మనసులు కలిశాయి
ఆ తర్వాత ఆమెతో సోషల్ మీడియా ద్వారా చాటింగ్ చేశాడు. అతడి ప్రవర్తనలో ఆమెకు మార్పు కనిపించింది. దీంతో స్నేహాన్ని కట్ చేసింది. దీంతో అతను మరో సోషల్ మీడియా ఖాతా తెరిచి ఆమెను వేధించాడు. ఆమెతో తన పరిచయాన్ని కవితల్లా రాసి అందరికీ షేర్ చేశాడు. ఆమె గత జన్మలో తన భార్య అని, ఈ జన్మలో మనసులు కలిశాయని పేర్కొన్నాడు.
ముగ్గురం కలిసి కాపురం చేద్దాం..
ఆమెది జమ్ము కాశ్మీర్. అతను ఆ మహిళ ఇంటికి కూడా వెళ్లి, ఆమె కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పాడు. వారు హెచ్చరించి పంపించారు. గత జన్మలో తామిద్దరం భార్యాభర్తలమని నా ప్రస్తుత భార్యకు చెప్పి ఒప్పించానని, తనతో వస్తే ముగ్గురం కలిసి కాపురం చేద్దామని పేర్కొన్నాడు.
ఓసారి జైలుకెళ్లి వచ్చినా, మళ్లీ వేధింపులు
అతని వేధింపులు రోజురోజుకు ఎక్కువయ్యేసరికి ఆమె గత ఏడాది సైబరాబాద్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. తాజాగా, మరోసారి అతను అలాగే వేధించడంతో పోలీసులను మళ్లీ ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.