చికెన్ వడ్డించలేదన్న కారణంతో..: నిశ్చితార్థంలో ఘోరం జరిగిపోయింది
హైదరాబాద్: వివాహ నిశ్చితార్థానికి వచ్చిన ఓ వ్యక్తి.. చికెన్ వడ్డించలేదన్న కారణంతో వడ్డిస్తున్న వ్యక్తిని హతమార్చాడు. హైదరాబాద్ పాతబస్తీలోని హుస్సేనీ ఆలం పోలీస్స్టేషన్ పరిధి షాగంజ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. షాగంజ్ ప్రాంతంలోని హరేహత్ మంజిల్ అనే ఫంక్షన్ హాల్లో ఆదివారం రాత్రి ఓ యువకుడి నిశ్చితార్థ వేడుక జరిగింది. వేడుకకు అశ్వాక్ అనే వ్యక్తి హాజరయ్యాడు. నిశ్చితార్థం అనంతరం భోజనం చేయడానికి వెళ్లిన అతను.. చికెన్ వడ్డించలేదని ఆగ్రహం చెందాడు.
అదే ఆగ్రహంతో తన మిత్రులకు ఫోన్ చేసి అక్కడికి రప్పించాడు. అశ్వాక్ మిత్రుల్లో ఒకరు.. ఆహార పదార్థాలు వడ్డిస్తున్న అన్వర్ కడుపులో కత్తితో పొడిచాడు. అడ్డుకోబోయిన సోహైల్ వీపుపై కత్తితో పొడిచి వారంతా పారిపోయారు. గాయపడ్డ ఇద్దరిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అన్వర్ మృతి చెందాడు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న హుస్సేని ఆలం పోలీసులు.. నిందితుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.