వివాహేతర సంబంధం: తండ్రి-ప్రియురాలిపై పెట్రోల్ పోసిన కొడుకు, ముగ్గురు మృతి
వరంగల్: వరంగల్ జిల్లా దామెర మండలంలో దారుణం జరిగింది. తండ్రి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో కొడుకు కుటుంబ సభ్యులపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా దామెర మండలంలో చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా దామెర మండలం కంఠాత్మకూరుకు చెందిన కార్తీక్ అనే వ్యక్తి తండ్రి కుమారస్వామి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలిసింది.
దీంతో ఆగ్రహించిన కార్తీక్ తండ్రితో సహా ఇతర కుటుంబ సభ్యులపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ఈ ఘటనలో నానమ్మ రాజమ్మ, తండ్రి కుమారస్వామి, ఓ మహిళ చనిపోయారు. తాతయ్య మాత్రం కొస ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. ఈ సంఘటన ఆదివారం అర్ధరాత్రి జరిగింది.
మహిళతో వివాహేతర సంబంధం
కంఠాత్మకూర్కు చెందిన 48 ఏళ్ల కుమారస్వామికి కౌసల్యతో పెళ్లయింది. పెళ్లైన తర్వాత వారు హన్మకొండకు వచ్చారు. అతను ప్లంబర్ పని చేస్తున్నాడు. వీరికి ఇరవై అయిదేళ్ల కార్తీక్తో పాటు కూతురు ఉన్నారు. కార్తీక్ ప్రస్తుతం ఓ హోటల్లో పని చేస్తున్నారు. అయితే కుమారస్వామికి భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న సుమలత అనే మహిళతో వివాహేతర సంబంధం ఉంది.
ఇల్లు అద్దెకు తీసుకొని సహజీవనం
ఆమెను పైడిపల్లి క్రాసింగ్ వద్ద అద్దె ఇంట్లో ఉంచుతూ సహజీవనం సాగిస్తున్నాడు. వివాహేతర సంబంధం కారణంగా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని కుటుంబ సభ్యులు ఆయనతో గొడవపడేవారు. కొడుకు కార్తీక్, తండ్రి కుమారస్వామిలకు మధ్య పలుమార్లు గొడవ జరిగింది. తండ్రిలో ఏమాత్రం మార్పు రాలేదు.
నిర్లక్ష్యంపై కొడుకు ఆగ్రహం
తండ్రి తమను నిర్లక్ష్యం చేయడం వల్లే తన చదువు కూడా మధ్యలోనే ఆగిపోయిందని కార్తీక్ వాపోయాడు. పైగా కుటుంబాన్ని పట్టించుకోవడం లేదనే కోపం పెరిగింది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి తన తండ్రి కంఠాత్మకూర్లోని తన నానమ్మ ఇంట్లో తన ప్రియురాలితో కలిసి ఉన్నాడని కార్తీక్కు తెలిసింది.
నలుగురిపై పెట్రోల్ పోశాడు
కార్తీక్ తన వెంట పెట్రోల్ పట్టుకొని వెళ్లాడు. కార్తీక్ ఆ ఇంట్లో ఉన్న తండ్రి, అతని ప్రియురాలుతో పాటు వారికి మద్దతుగా నిలిచిన నానమ్మ, తాతయ్య లింగయ్యపై ఇంట్లో ఉండగానే పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. లింగయ్య మినహా మిగతా ముగ్గురు చనిపోయారు. లింగయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో కార్తీక్ గాయపడ్డాడు.