Mulugu Rains: నీట మునిగిన మేడారం.. జంపన్నవాగు వరదలకు కొండాయిలో 8మంది గల్లంతు!!
గతంలో ఎన్నడూ లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో రికార్డు వర్షపాతం నమోదయింది. మబ్బుకు చిల్లులు పడినట్టు కుండపోతగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. ఇక ములుగు జిల్లాలో కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే ఏజెన్సీ గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.
ఇదిలా ఉంటే ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో జంపన్న వాగు ఉధృతంగా ప్రవహించటంతో కొండాయిలో వరద నీటిలో 8 మంది కొట్టుకుపోయినట్లుగా తెలుస్తుంది. అయితే వారిలో నలుగురిని స్థానికులు కాపాడగా, మరో నలుగురు గల్లంతయ్యారు. గల్లంతు అయిన వారు రషీద్, శరీష్, అజ్జు, మహబూబ్ ఖాన్ లు గల్లంతు అయినట్టు సమాచారం. వీరిని గాలించటం కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.

కొండాయిలో తాజా పరిస్థితులతో వరద దెబ్బకు సమీప బంగ్లాలు ఎక్కి గ్రామస్తులు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. వరద నీటిలో కొట్టుకుపోయిన వారిని గాలించడం కోసం అధికారులు రంగంలోకి దిగుతున్నారు. ఇదిలా ఉంటే ములుగు జిల్లా మేడారంలో దయనీయమైన పరిస్థితులు నెలకొన్నాయి. మేడారం సమ్మక్క సారక్క సారలమ్మ ఆలయాలు జంపన్న వాగు పొంగి పొర్లటంతో నీటమునిగాయి. సమ్మక్క సారలమ్మల గద్దెల వద్దకు నీరు చేరింది.
నీట మునిగిన మేడారం.. కొండాయిలో 8మంది గల్లంతు #Medaram #Warangal #TelanganaRains #TSRains #TelanganaNews #Oneindiatelugu pic.twitter.com/RWnYbOwbOh
— oneindiatelugu (@oneindiatelugu) July 27, 2023
సమ్మక్క సారలమ్మ ఆలయాలలో కి మూడు అడుగుల మేర నీరు చేరుకుంది . జంపన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో గ్రామమంతా నీట మునిగింది. దీంతో మేడారంలో నివసిస్తున్న ప్రజలు సహాయం కోసం అర్థిస్తున్నారు. అధికారులు రంగంలోకి దిగి నిరాశ్రయులైన ఆదివాసీలను బోట్ల సహాయంతో పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.

కాగా కాటారం నుండి మేడారం కు వెళ్ళే రహదారి మధ్యలో గల పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమీప గ్రామాల ప్రజలకు ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఇదిలా ఉంటే వర్షాల కారణంగా వరంగల్ భూపాలపట్నం జాతీయ రహదారిపై వరద నీరు చేరుకోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో రాకపోకలను పునరుద్ధరించడం కోసం అధికారులు చర్యలు చేపట్టారు. కాగా పులుకుర్తి గ్రామానికి వెళ్లే మార్గంలో వరద తాకిడి ఎక్కువ కావడంతో రాకపోకలు నిలిపివేసి రోడ్డును బ్లాక్ చేశారు.












Click it and Unblock the Notifications