మెడికో ప్రీతి మృతి కేసు: నిందితుడు సైఫ్కు బెయిల్ మంజూరు
హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించి మెడికో విద్యార్థి ప్రీతి మృతి(ఆత్మహత్య) కేసులో నిందితుడు డాక్టర్ సైఫ్కు బెయిల్ మంజూరైంది. సైఫ్కు బుధవారం షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేశారు వరంగల్ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయమూర్తి సత్యేంద్ర. రూ. 10 వేల రూపాయల ఇద్దరు పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది.
16 వారాల పాటు ప్రతి శుక్రవారం కేసు విచారణ ఆఫీసర్ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. కేసులో సాక్షులను ప్రభావితం చేయకూడదని స్పష్టం చేసింది. ప్రీతి కుటుంబ సభ్యులను బెదిరించే ప్రయత్నం చేయొద్దని.. ఒక వేళ షరతులు ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు చేస్తామని హెచ్చరించింది.

ఫిబ్రవరి 22న మెడికో విద్యార్థి ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. 24న నిందితుడైన డాక్టర్ సైఫ్ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. సైఫ్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ తోపాటు ర్యాగింగ్ కేసు కూడా నమోదు చేశారు. 26న హైదరాబాద్లోని నిమ్స్ లో చికిత్స పొందుతూ ప్రీతి మృతి చెందింది.
ప్రీతి ఆత్మహత్యకు సీనియర్ స్టూడెంట్ సైఫ్ వేధింపులే కారణమని పోలీసులు పేర్కొన్నారు. అయితే, ప్రీతి తండ్రి మాత్రం తమ కూతురిది మూమ్మాటికీ హత్యే అని ఆరోపించారు. కావాలనే డయాలసిస్ చేసి టాక్సికాలజీ రిపోర్టును తప్పుదారి పట్టించినట్లు ఆరోపించారు. మరోవైపు, ప్రీతికి సంబంధించిన పోస్టుమార్టం రిపోర్టు గానీ, ఫోరెన్సిక్ రిపోర్టు గానీ తమకు ఇవ్వలేదని ఆమె సోదరుడు పృథ్వీ తెలిపారు. ప్రీతి ఎలా చనిపోయిందన్న విషయం ఇప్పటికీ చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
సైఫ్ వేధింపుల కారణంగా ప్రీతి ఆత్మహత్యకు ప్రయత్నించడంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. హానికరమైన మెడిసిన్ తీసుకోవడంతో ఆమె అపస్మారక స్థితిలోకి చేరుకుందని వైద్యులు తెలిపారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ నుంచి హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయినప్పటికీ ప్రీతి ప్రాణాలు దక్కలేదు. దీంతో ఆమె కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. ప్రీతికి న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా జరిగాయి. ప్రీతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామన్న ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది.












Click it and Unblock the Notifications