హైదరాబాద్-విజయవాడ వాహనదారులకు గుడ్న్యూస్
ఎప్పుడూ రద్దీగా ఉండే హైదరాబాద్-విజయవాడ హైవేపై వెళ్లే వాహనదారులకు శుభవార్త. హైవేపై ప్రమాదాలను నివారించేందుకు చర్యలు చేపడుతోంది తెలంగాణ సర్కారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర, జాతీయ రహదారుల అధికారులతో ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ఎన్హెచ్ 65 రహదారిపై తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు కారణాలను సమావేశంలో చర్చించారు.
హైదరాబాద్ నుంచి విజయవాడ రహదారిలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు అవసరమైన చర్యలను వెంటనే చేపట్టాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. హైవేలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్న 17 బ్లాక్ స్పాట్ ప్రాంతాలను అధికారులు వివరించారు.

చౌటుప్పల్, పెదకాపర్తి, చిట్యాల, కట్టంగూర్, ఇనుపాముల, టేకుమట్ల, జనగామ క్రాస్ రోడ్స్, ఈనాడు జంక్షన్, దురాజ్ పల్లి జంక్షన్, ముకుందాపురం, అకుపాముల, కోమరబండ క్రాస్ రోడ్స్, కటకం గూడెం, మేళ్ల చెరువు, శ్రీరంగాపురం, రామాపురం క్రాస్ రోడ్స్, నవాబ్పేట జంక్షన్ వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలిపారు.
బ్లాక్ స్పాట్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించిన సందర్భంగా.. సైన్ బోర్డులు, వేగ నియంత్రణ వంటి చర్యలను వెంటనే చేపట్టాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. రహదారిపై కొన్నిచోట్ల ఆరులేన్ల నిర్మాణం, జంక్షన్ల అభివృద్ధి, అండర్ పాస్లు, సర్వీసు రోడ్ల నిర్మాణం వంటి ప్రణాళికలు చేయాలని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో రహదారులను యాక్సిడెంట్ ఫ్రీ గా మారుస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారులను కూడా త్వరితగతిన పూర్తిచేసేలా అధికారులకు దిశానిర్ధేశం చేయడం జరిగిందన్నారు. ఆర్ఆర్ఆర్ రాష్ట్ర భవిష్యత్తును మార్చే సూపర్ గేమ్ ఛేంజర్ అని మంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. RRR ను త్వరితగతిన పూర్తిచేసేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.












Click it and Unblock the Notifications