తెలంగాణ కల సాకారానికి ఏడేళ్లు.!ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సత్యవతి.!
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం అవతరించి ఏడేళ్లు పూర్తిచేసుకుని ఎనిమిదో వసంతంలోకి అడుగుపెడుతున్న ఈ పర్వదినాన రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర గిరిజన, స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో, స్వరాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంతో, ప్రాణాన్ని పణంగా పెట్టి కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చడంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఈ ఏడేండ్లు చేసిన అవిరామ కృషి, అలుపులేని దీక్ష, అనుక్షణం జరిపిన మేథోమథన ఫలితం నేడు మన కళ్లముందు ప్రత్యక్షంగా కనపడుతోందని సత్యవతి రాథోడ్ తెలిపారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఓ పర్వదినం.. రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలన్న మంత్రి సత్యవతి..
ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు అన్న టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, రాష్ట్ర మంత్రి కేటిఆర్ మాటలు నిజమై రాష్ట్రంలో నేడు జలకళ ప్రతి కాలువలో, చెరువులో, రిజర్వాయర్ లో కనిపిస్తూ, కరువు అన్న పదం తెలంగాణ చెరువుల్లో శాశ్వతంగా సమాధై, నీళ్ల బాధ సమూలంగా తొలిగిందని మంత్రి సత్యవతి స్పష్టం చేసారు. రాష్ట్రంలో సమైక్య పాలనలో గడిచిన 60 ఏళ్లలో జరగని ప్రగతి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సమర్థపాలనలో గత ఏడేళ్లలోనే జరిగిందని, నేడు లక్ష కోట్లకు పైగా పసిడి పంటలు పండించుకునే పచ్చని పచ్చలహారంగా తెలంగాణ ఆవిష్కృతమైందని సత్యవతి తెలిపారు.

చీకట్ల తొలగి వెలుగులు నిండిన రోజు.. కేసీఆర్ చరిత్రకారుడన్న సత్యవతి రాథోడ్..
తెలంగాణ వస్తే చీకట్లే తప్ప వెలుగులుండవన్న గత పాలకుల మాటలు ఒట్టి బూటకమని నిరూపిస్తూ చీకటే దరిచేరని వెలుగుల తెలంగాణను తెచ్చిన తెలంగాణ సూర్యుడు మన సిఎం కల్వకుంట్ల చంద్రశేఖరుడని, వ్యవసాయమంటే దండగ కాదని 24 గంటల ఉచిత విద్యుత్, ప్రాజెక్టుల రీడిజైనింగ్, రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీలతో, విత్తనాలు, ఎరువుల పుష్కల పంపిణీతో వ్యవసాయాన్ని పండగ చేసి, రైతును రాజును చేస్తున్న ముఖ్యమంత్రి దేశంలో చంద్రశేఖర్ రావు ఒక్కరే అని, ఆత్మహత్యల తెలంగాణను ఈ ఏడేండ్లలో ఆత్మగౌరవ తెలంగాణగా, అన్నదాతకు వన్నె తెచ్చిన తెలంగాణాగా మార్చి ప్రపంచానికి చాటిచెప్పిన మహానేత, తెలంగాణ విధాత మన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అని గుర్తు చేసారు సత్యవతి.

ఐటి రంగంలో విప్లవాత్మక మార్పులు.. కేటీఆర్ ముందుచుపున్న నాయకుడన్న రాథోడ్..
ఐటీలోనూ తెలంగాణను మేటిగా చేస్తూ, సంక్షేమంలో మాకు సాటి ఎవరు లేరని చాటుతూ 40వేల కోట్లకు పైగా రూపాయలతో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, అభివృద్ధికి చిరునామాగా రాష్ట్రాన్ని మారుస్తూ, ప్రపంచంలోని పరిశ్రమలు తెలంగాణకు తరలివచ్చేలా పారిశ్రామిక విప్లవాన్ని తీసుకొచ్చే టిఎస్ ఐపాస్ రూపొందించి, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో రాష్ట్రమంతటిని ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తూ, బంగారు తెలంగాణ లక్ష్య సాధనలో వడివడిగా ముందుకు వెళ్తూ ఎనిమిదేళ్ల రాష్ట్ర ఆవిర్భావ సంబురంలోకి ఎంతో సంతోషంతో అడుగు పెడుతున్న ఈ సందర్భం మరపురానిదని, మనందరికీ పండగవంటిదని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు.
Recommended Video

రాష్ట్ర ఆదాయం కన్నా ప్రజల ప్రాణాలే మిన్న.. అందుకే కేసీఆర్ లాక్డౌన్ విధించారన్న మంత్రి సత్యవతి..
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న మహమ్మారి కరోనా వైరస్ కట్టడి కోసం ఆర్ధిక నష్టం వస్తున్నా ప్రజల ప్రాణాలే ప్రధానమని లాక్డౌన్ విధించి కోవిడ్ ను కట్టడి చేస్తున్నారు సీఎం చంద్రవేఖర్ రావు. ఏ మహమ్మారి వచ్చినా భవిష్యత్ లో రాష్ట్ర ప్రజలు వైద్య పరంగా ఇబ్బంది పడకుండా ఆరోగ్య రంగాన్ని సంపూర్ణంగా సంస్కరిస్తున్న ఆరోగ్య ప్రదాత మన సీఎం అన్నారు సత్యవతి. ముఖ్యంగా ఇటీవల ప్రకటించిన మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, రీజినల్ సబ్ సెంటర్ల వల్ల గిరిజన ప్రాంతాల్లో కూడా నాణ్యమైన వైద్య సదుపాయం అందే అవకాశం ఏర్పాటు చేసిన గిరిజన అభ్యుదయ నేత అని ప్రసంశించారు. లాక్డౌన్ కు సహకరించి కోవిడ్ కట్టడికి ప్రజలంతా సహకరించాలని మంత్రి సత్యవతి రాథోడ్ విజ్ణప్తి చేసారు.












Click it and Unblock the Notifications