మహిళా పోలీసులపై చెయ్యేసి నెట్టేశారు, హరీష్ రావు షర్ట్ ఎలా విప్పుతారు: సీతక్క ఫైర్
తెలంగాణా శాసనసభా సమావేశాలు ఆదిలోనే రచ్చ రచ్చగా మారాయి. సమావేశాల తొలిరోజే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కొనసాగింది. శాసన సభా సమావేశాల సందర్భంగా నల్ల దుస్తులతో నిరసన తెలిపిన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసే దాకా వెళ్ళింది. దీంతో స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలను చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుపై వేటు వెయ్యాలని ప్రధానంగా డిమాండ్ వినిపిస్తుంది.
ఈ క్రమంలో నేడు తెలంగాణ శాసనసభ, శాసనమండలి రెండో రోజు సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి. సోమవారం ఉదయం అసెంబ్లీ వద్ద BRS ఎమ్మెల్యేలు, మహిళా సభ్యులకు జరిగిన అవమానంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే తిరిగి తమపైనే కేసులు నమోదు చేశారని బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉపనేత హరీష్ రావు అన్నారు. దీనికి శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ, ఘటనపై విచారణ జరుగుతోందని తెలిపారు.

శాసనసభాపతి స్థానాన్ని ఉద్దేశించి హరీష్ రావు బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారని.. శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను ఎలా నడపాలో స్పీకర్ను నిర్దేశించడానికి ప్రతిపక్ష నేతలెవరని ప్రశ్నించారు. మంత్రి సీతక్క శాసనమండలిలో మాట్లాడుతూ అసెంబ్లీలో జరిగిన ఘటనపై నిజాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మహిళా ఎమ్మెల్యేల ముందు, వెనుక ఉండి నడిపించిన వారి అసలు రంగు బయటపడాలని స్పష్టం చేశారు.
అసెంబ్లీ ప్రాంగణంలో ఉదయం జరిగిన ఘటనలపై ఆమె స్పందిస్తూ, విధుల్లో ఉన్న మహిళా పోలీసులపై బీఆర్ఎస్ నాయకులు చేయి వేసి నెట్టేశారని ఆరోపించారు. ఆ దృశ్యాలను సభలో ప్రదర్శించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలు స్పీకర్ను అనుచిత, అసభ్య పదజాలంతో దూషించారని, కానీ తాము ఏమీ అనలేదని అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. వారికి తల్లులు లేరా? అని సీతక్క ప్రశ్నించారు.
సభా మర్యాదలు పాటించకుండా అసెంబ్లీలో స్పీకర్ మీదకి వెళ్తున్నారు అని మంత్రి సీతక్క అసహనం వ్యక్తం చేశారు. తమ పాలనలో మహిళా పోలీసులు, ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ హరీశ్ రావు దుస్తులు ఎలా విప్పుతారని కూడా ఆమె ప్రశ్నించారు . గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తమను పోడియం వద్దకు కూడా రానివ్వలేదని మంత్రి సీతక్క గుర్తు చేశారు.
సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి వంటి మహిళా నేతల పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తిస్తే వారిపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. మహిళలపై జరిగిన అవమానాన్ని తాము ఎటువంటి స్థితిలోనూ సహించబోమని హెచ్చరించారు. ప్రతిపక్ష నేతలు సభా మర్యాదలు పాటించాలని, మహిళా సిబ్బందిపై దాడులు జరగకూడదని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. సభలో జరిగిన అనుచిత ప్రవర్తనపై సరైన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.












Click it and Unblock the Notifications
