కేటీఆర్ బండారం బయటపెట్టిన మంత్రి సీతక్క సంచలనం!
నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు ఆందోళనల నేపథ్యంలో బీఆర్ఎస్ పోరాటం చేస్తున్న ప్రజల పక్షాన నిలబడి ఇథనాల్ పరిశ్రమ పైన ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. దిలావర్ పూర్ లో రైతుల ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం దిగివచ్చింది. ఈ క్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ దిలావర్ పూర్ లో రైతుల దెబ్బకు రేవంత్ రెడ్డి దిగివచ్చారని వ్యాఖ్యలు చేశారు.
కేటీఆర్ కు మంత్రి సీతక్క కౌంటర్
అయితే తాజాగా మంత్రి సీతక్క బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కౌంటర్ వేశారు. నిర్మల్ జిల్లాలోని దిలావర్ పూర్ కు కేటీఆర్ రావాలని అక్కడే ఇథనాల్ పరిశ్రమకు అనుమతులు ఇచ్చింది ఎవరు అనేది తేలుద్దామని కేటీఆర్ కు సవాల్ విసిరారు. ఇథనాల్ పరిశ్రమకు అన్ని అనుమతులు ఇచ్చింది కేసీఆర్, కేటీఆర్ అని మంత్రి సీతక్క ఆరోపించారు. కేటీఆర్ ఎక్కడెక్కడో తిరుగుతూ ఏవేవో వ్యాఖ్యలు చేయడం వృధా అన్నారు.

అక్కడికే వెళదాం రా కేటీఆర్
ఎక్కడైతే ఆందోళన జరుగుతుందో అక్కడికే వెళదాం రమ్మంటూ సీతక్క పిలుపునిచ్చారు. ఎవరు అనుమతులు ఇచ్చారో అక్కడే తేలుద్దామని సీతక్క స్పష్టం చేశారు. అంతే కాదు ఇథనాల్ కంపెనీకి గత ప్రభుత్వం అనుమతులు ఇచ్చే నాటికి కంపెనీ డైరెక్టర్ గా తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయి ఉన్నట్టుగా సీతక్క తెలిపారు. ఇక మరో డైరెక్టర్ గా పుట్టా సుధాకర్ కుమారుడు ఉన్నాడని సీతక్క పేర్కొన్నారు.
ఇథనాల్ పరిశ్రమకు అనుమతి ఇచ్చింది కేటీఆర్ నే
పుట్టా సుధాకర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇద్దరూ వియ్యంకులని మంత్రి సీతక్క గుర్తు చేశారు. గతంలో ఎటువంటి గ్రామసభలను నిర్వహించకుండానే ఇథనాల్ కంపెనీకి అనుమతులు ఇచ్చారని సీతక్క ఆరోపించారు. కేటీఆర్ దిలావర్ పూర్ రావడానికి సిద్ధంగా ఉన్నారా అంటూ సీతక్క ప్రశ్నించారు. ఈ పరిశ్రమకు 2023లోనే అనుమతులు ఇచ్చారని బీఆర్ఎస్ ప్రభుత్వం నాడు అనుమతులు ఇచ్చి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పైన నిందలు మోపడం వారికే చెల్లుతుందన్నారు.
చిల్లర రాజకీయాలు అవసరమా? సీతక్క ప్రశ్న
ఈ చిల్లర రాజకీయాలు అవసరమా అంటూ కేటీఆర్ పైన ఆమె మండిపడ్డారు. ఇప్పటికైనా డ్రామాలు ఆడటం మానుకోవాలని సీతక్క సూచించారు. మీ నాయకులు డైరెక్టర్లుగా ఉన్న కంపెనీలో మీరు చేసిన తప్పులను కప్పిపుచ్చుకొని మాపై నిందలు మోపడం కరెక్ట్ కాదన్నారు. కేటీఆర్ కు నీతి, రీతి, జాతి ఉంటే కంపెనీకి అనుమతి ఇచ్చింది తానేనని ఒప్పుకోవాలన్నారు సీతక్క.
నిసిగ్గుగా మాపై నిందలా
ఇక అసెంబ్లీలో దీనిపైన చర్చ చేస్తామని, స్పీకర్ ముందు ఈ వ్యవహారాన్ని పెడతామని మీరిచ్చిన అనుమతుల వివరాలు బయట పెడతామని సీతక్క స్పష్టం చేశారు. నిసిగ్గుగా మాపై నిందలు మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ రాజకీయాలపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక కుట్ర
ఇదే సమయంలో సంక్షేమ వసతి గృహాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక కుట్ర ఉందని మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కుట్ర వెనక ఎవరు ఉన్నారు? అన్నది త్వరలోనే బయట పెడతామని సీతక్క పేర్కొన్నారు. కుట్ర దారులు వెనుక అధికారులు ఉంటే వాళ్లను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications