కోఆర్డినేటర్లకు స్వస్తి పలకండి.. ఫిర్యాదులకై ఎఫ్డీసీలో ప్రత్యేక సెల్: మంత్రి తలసాని
హైదరాబాద్: సినీ పరిశ్రమలో చోటు చేసుకుంటున్న వివాదాస్పద అంశాలపై రాష్ట్ర సచివాలయంలో సినీ ప్రముఖులు, 'మా' ప్రతినిధులతో చర్చించారు సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.ఈ సమావేశానికి పోలీసులు, ఇతర శాఖల ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. ముఖ్యంగా సినీ రంగంలో వివాదాలు, లైంగిక వేధింపుల ఆరోపణలపై చర్చించారు.
మహిళలు, నటులు.. ఏవైనా సమస్యలు ఉంటే పోలీసుల దృష్టికి తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా తలసాని వారికి సూచించినట్టు సమాచారం. 'మా' సభ్యత్వంపై వివాదాలు వెల్లువెత్తుతుండటంతో.. ఫిలిం డెవలప్ కార్పోరేషన్ ద్వారా గుర్తింపు కార్డులు ఇవ్వాలని నిర్ణయించామని సమావేశ అనంతరం తలసాని తెలిపారు.
కోఆర్డినేటర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో.. ఇకపై దానికి స్వస్తి పలకాలని తలసాని సినీ ప్రముఖులకు చెప్పినట్టు తెలుస్తోంది. కోఆర్డినేటర్లు లేకుండా మేనేజర్ ద్వారానే నేరుగా బ్యాంకు ఖతాలకు చెల్లింపులు జరిపేలా చూడాలని ఆయన చెప్పినట్టు సమాచారం. ఇకపై మహిళల పట్ల వేధింపుల విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తామని.. ఫిర్యాదుల కోసం ఎఫ్డీసీలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామన్నారు.
వివాదానికి ఇక ఫుల్ స్టాప్ పెట్టాలని పరిశ్రమను, మీడియాను మంత్రి తలసాని కోరినట్టు తెలుస్తోంది. అలాగే భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని సినీ పెద్దలు చెప్పారని మంత్రి మీడియాకు తెలిపారు.