జైల్లో చచ్చిపో.. లేదంటే చంపేస్తారు: ప్రణయ్ తమ్ముడు, వదినను చూసి కన్నీరుమున్నీరు
మిర్యాలగూడ: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రేమ, పెళ్లి కారణంగా ప్రణయ్ హత్యకు గురైన విషయం తెలిసిందే. అతని సోదరుడు అజయ్ ఉక్రెయిన్ నుంచి వచ్చాడు. శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన అతను నేరుగా మిర్యాలగూడలోని తన ఇంటికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా ప్రణయ్ భార్య అమృత, ప్రణయ్ తల్లిదండ్రులు... అజయ్ వద్దకు వచ్చి ఏడ్చారు. వదినను, తల్లిదండ్రులను అలా చూసి అజయ్ కన్నీరుమున్నీరు అయ్యాడు. అక్కడ ఉద్వేగభరిత, ఉద్విగ్న వాతావరణం కనిపించింది. అజయ్ రాకతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా అజయ్ మాట్లాడారు.
అమృతపై ప్రేమతోనే చంపించా, 9వ తరగతిలోనే చెప్పా: ప్రణయ్ హత్యపై అమ్మాయి తండ్రి
కక్ష కాదు నమ్మకద్రోహం
ప్రేమ పెళ్లి చేసుకున్నందుకు తన వదిన (అమృత) నాన్న కక్ష పెంచుకున్నారని అజయ్ ఏడుస్తూ చెప్పారు. అమృత తండ్రి, బాబాయ్ శ్రవణ్లను ప్రజలే చంపేస్తారని హెచ్చరించారు. ఇంతటి సైకో తండ్రిని తాను ఎక్కడా చూడలేదన్నారు. అమృతకు ఆమె మమ్మీ ఎప్పటికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంటుందని, వీరు ఎక్కడకు వెళ్తున్నారో.. ఎక్కడకు వస్తున్నారో తల్లికి తెలుసునని, ఇది కక్ష మాత్రమే కాదని, నమ్మకద్రోహం అన్నారు. కుటుంబ సభ్యులంతా కలిసి హత్య చేశారన్నారు.
రిసెప్షన్కు వచ్చి వెళ్లా
తాను వినాయక చవితి ముందు రోజు తన అన్నయ్య ప్రణయ్తో మాట్లాడానని అజయ్ చెప్పారు. వారు ఇలా చంపేస్తారని తాము ఊహించలేదన్నారు. అందరు కలిసి చంపేశారన్నారు. తన అన్నయ్యకు బెదిరింపులు వచ్చే విషయం తెలుసునని చెప్పారు. తాను తన అన్న, వదినల పెళ్లి జరిగినప్పుడు ఇక్కడ లేనని, రిసెప్షన్కు వచ్చి వెళ్లానని చెప్పారు.
డైరెక్ట్ మెసేజ్ ఇస్తున్నా.. జనాలే చంపేస్తారు
ఈ సందర్భంగా అజయ్ మాట్లాడుతూ.. వాళ్లకి కోట్ల రూపాయలు ఉన్నాయని, ఆయన ఎంత చూపించుకుంటాడో చూపించుకోనివ్వండని, కానీ నేను డైరెక్ట్ మెసేజ్ ఇస్తున్నానని, జనాలు నిన్ను చంపేస్తార్రా.. అని కన్నీరుమున్నీరు అయ్యారు. మీ ఫ్యామిలీలో ఎవరూ మిగలరన్నారు. నువు జైల్లో చచ్చిపో.. బయటకు వస్తే మాత్రం జనాలు చంపేస్తారన్నారు. నీవు, నీ తమ్ముడు, అందర్నీ చంపేస్తారన్నారు. మేం చంపం... కానీ జనాలు మిమ్మల్ని మిగల్చరన్నారు.
మిర్యాలగూడ సెంటర్లో విగ్రహం
ప్రణయ్ భార్య అమృత మాట్లాడుతూ... మిర్యాలగూడ సెంటర్లో ప్రణయ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తన తండ్రి నా ఎదురుగా వచ్చి క్షమించమని వేడుకున్నా చంపేస్తానని చెప్పారు. మా నాన్న, బాబాయ్లు సైకోలు అన్నారు. తనకు, తన బిడ్డకు పోలీసు రక్షణ కావాలన్నారు. ఇలాంటి హత్యలు, కులరహిత సమాజం కోసం పోరాడుతానని చెప్పారు. నా బిడ్డను నేనే పెంచుకుంటానని, పుట్టింటికి వెళ్లనని చెప్పారు.
గర్భవతిని కాకుంటే నేనూ వచ్చి ఉండేదాన్ని
అంతకుముందు, ప్రణయ్ మృతదేహాన్న చూసిన అమృత గుండెలు అవిసేలా రోధించింది. ప్రణయ్ చనిపోయాడని తెలియగానే తాను కూడా ఆయన దగ్గరకే వెళ్లిపోవాలనుకున్నానని, కానీ తన కడుపులో పెరుగుతోన్న తన ప్రతిరూపం కోసమే బతికున్నానని చెప్పింది. తాను కన్సీవ్ కాకుంటే ఈ పాటికే నీ దగ్గరికి వచ్చి ఉండేదానిని అన్నారు. అమృతను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు.