కేసీఆర్ సర్కారు పతనం ఖాయం, అప్పుల తెలంగాణ చేశారంటూ ఈటల రాజేందర్ ఫైర్
హైదరాబాద్: తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై మాజీ మంత్రి, హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. హుజూరాబాద్ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్లో అసహనం పెరిగిపోయిందని మండిపడ్డారు. లింగోజీగూడెంలో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం చౌటుప్పల్లోని బీజేపీ కార్యాలయంలో ఈటల మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ సర్కారు గోరీ కడతారంటూ ఈటల ఫైర్
రానున్న ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు గోరీ కట్టడం ఖాయమని, రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరబోతోందని ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ అహంకారం, ఆధిపత్య దోరణి, రాచరిక పోకడలు తెలంగాణ గడ్డ మీద చెల్లవని.. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో రుజువైందని ఈటల తెలిపారు. ఓడించారనే అక్కసుతోనే ధాన్యం కొనకుండా రైతులను వేధింపులకు గురిచేస్తున్నారని దుయ్యబట్టారు.
ప్రజలు కర్రు కాచి వాతపెడ్తారంటూ ఈటల
రైతులు పండించిన పంటను కొనే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది కాదా? అని ఈటల రాజేందర్ నిలదీశారు. కేసీఆర్ అసమర్త సీఎం అని పలు జాతీయ సర్వేలు చెబుతున్నాయని విమర్శించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, సందర్భం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ఈటల తెలిపారు.
బీజేపీ ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్ రావు, ఉపాధ్యక్షుడు రమణగోని శంకర్, నాయకులు గూడల భిక్షంగౌడ్, వెంకటేశం గౌడ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కేంద్రం చెప్పినా.. కేసీఆర్ నిర్లక్ష్యం చేశారన్న ఈటల
కేంద్ర ప్రభుత్వం ఏడు సంవత్సరాల నుంచి తెలంగాణలో ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తోందన్నారు. రైతాంగం పండించిన ధాన్యం మీద మొత్తం పెట్టుబడి కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు ఈటల. కేంద్రం రా రైస్ మాత్రమే తీసుకుంటామని తెలిపింది. దంపుడు బియ్యం వద్దని చెబితే.. దీనికి రాష్ట ప్రభుత్వం ఒప్పుకుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనకపోవడతో రైతులు కల్లాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. రాజకీయాలు పక్కనపెట్టి రైతుల ధాన్యం కొనుగోలు చేయాలి. ధనిక రాష్ట్రం అని చెప్పే ముఖ్యమంత్రి.. రైతుల ధాన్యం ఎందుకు కొనడంలేదని సూటిగా అడుగుతున్నా. కేంద్రం అవసరానికి మించిన ధాన్యం కొనుగోలు చేయం అని ముందే చెప్పింది. అయినా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకుండా ముఖ్యమంత్రి మొద్దు నిద్రలో ఉన్నారని దుయ్యబట్టారు ఈటల.
అప్పుల తెలంగాణ చేశారంటూ ఈటల రాజేందర్ నిప్పులు
పోలీసులను వాడుకుని సీఎం దౌర్జన్య రాజకీయాలు చేస్తురని ఈటల రాజేందర్ మండిపడ్డారు. రానున్న రోజుల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి రాబోతోంది అని ఈటల చెప్పారు. సొంత స్తలం ఉన్నవారికి వెంటనే డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేయాలని ఈటల రాజేందర్ సూర్యపేటలో పర్యటించిన సందర్భంగా డిమాండ్ చేశారు. 2014లో రాష్ట్ర అప్పులు రూ. 65 వేల కోట్లు ఉండగా, ఏడున్నరేళ్లలో ఆ అప్పు రూ. 4 లక్షల కోట్లకు చేరిందన్నారు. ప్రతి నెల రూ. 65 వేల కోట్లు వడ్డీ చెల్లించాల్సినన దుస్థితి వచ్చిందని తెలిపారు. విద్యార్థుల హాస్టల్ బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితిలో రాస్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలు కూడా చెల్లించలేదని మండిపడ్డారు వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ను భూస్థాపితం చేయడం ఖాయమని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.