మీరు సక్సెస్ కావాలి... వైఎస్ షర్మిలపై రాజగోపాల్ రెడ్డి కామెంట్స్... ఏ సంకేతాలు పంపిస్తున్నట్లు..?
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్గా మారింది.కాంగ్రెస్లో కొనసాగుతూనే ఆ పార్టీ లైన్కు ఆయన భిన్నంగా వ్యవహరిస్తున్నారు. సందర్భం వచ్చిన ప్రతీసారి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్న షర్మిలకు తాజాగా ఆయన మద్దతు పలికారు. మునుగోడు నియోజకవర్గంలోని పుల్లెంల గ్రామంలో మంగళవారం(జులై 27) వైఎస్ షర్మిల చేపట్టిన నిరుద్యోగ దీక్షకు ఆయన సంఘీభావం ప్రకటించారు.

రాజగోపాల్ రెడ్డి ఏమన్నారు...
దీక్షలో కూర్చొన్న షర్మిలకు రాజగోపాల్ రెడ్డి ఫోన్ చేసి మాట్లాడారు. 'నమస్తే షర్మిలమ్మ... మంచి కార్యక్రమం.. మా నియోజకవర్గంలో మీరు నిరుద్యోగుల కోసం ఒకరోజు దీక్ష చేపట్టినందుకు మీకు హృదయపూర్వక సంఘీభావం తెలియజేస్తున్నాను.మీరు సఫలీకృతం కావాలి. మాకు రాజశేఖర్ రెడ్డి ప్రాణం.మేం బతికున్నంతవరకు మా గుండెల్లో ఉంటాడు. మునుగోడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరందించేందుకు రూ.750 కోట్లతో ప్రాజెక్టు ప్రాజెక్ట్ ఇచ్చారు. 90శాతం పూర్తయిన ఆ ప్రాజెక్టును ఇప్పటికీ పూర్తి చేయలేదు.మా ప్రాంతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే ఆయన కోసం ప్రాణమిచ్చేంత టైప్.మీరు సక్సెస్ కావాలి. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా నిరుద్యోగుల తరుపున తీసుకున్న ఈ మంచి కార్యక్రమానికి మద్దతు ప్రకటిస్తున్నా. ఇవాళ ఉదయమే ఢిల్లీకి వచ్చా. లేదంటే మిమ్మల్ని కలిసేవాడిని.' అని రాజగోపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలకు 'థ్యాంక్స్ అన్నా...' అంటూ షర్మిల బదులిచ్చారు.

షర్మిలకు అనుకూలంగా కోమటిరెడ్డి బ్రదర్స్?
తెలంగాణలో వైఎస్ షర్మిల సారథ్యంలో వైఎస్సార్టీపీ ఏర్పడటం... అటు టీపీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డిని నియమించడంతో.. ఈ ఇద్దరిలో రెడ్డి సామాజికవర్గం ఎటువైపు ఉంటుందన్న చర్చ కొంతకాలంగా జరుగుతోంది. అదే సమయంలో రేవంత్ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాక కోమటిరెడ్డి బ్రదర్స్ ఆయనకు దూరంగానే ఉంటున్నారు. వైఎస్ షర్మిల పార్టీ ప్రారంభోత్సవం రోజున కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్వయంగా జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ వద్దకు వెళ్లి వైఎస్ అభిమానులతో ముచ్చటించారు. షర్మిల పార్టీకి ఆల్ ది బెస్ట్ కూడా చెప్పారు. తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైఎస్ షర్మిల చేస్తున్న నిరుద్యోగ నిరాహార దీక్షకు సంఘీభావం ప్రకటించడంతో ఈ ఇద్దరు బ్రదర్స్ వ్యవహారం కాంగ్రెస్లో చర్చనీయాంశంగా మారింది.
Recommended Video

ఏ సంకేతాలు పంపిస్తున్నట్లు..?
ఓవైపు రేవంత్ రెడ్డిని చంద్రబాబు మనిషిగా షర్మిల పదేపదే విమర్శిస్తుండగా... మరోవైపు షర్మిల రాజకీయాలను తాము సీరియస్గా తీసుకోవట్లేదని రేవంత్ చెబుతున్నారు. ఇలాంటి తరుణంలో కోమటిరెడ్డి బ్రదర్స్ షర్మిలకు మద్దతుగా మాట్లాడుతూ ఏ సంకేతాలు పంపిస్తున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. తాను బీజేపీలో చేరుతానని... రాష్ట్రంలో ఆ పార్టీ బలపడుతోందని గతంలోనే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయినా కాంగ్రెస్ పార్టీ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు షర్మిల రాజకీయాల పట్ల సానుకూల వైఖరితో వ్యవహరిస్తున్నారు. భవిష్యత్తులోనూ రాజగోపాల్ రెడ్డి ఇదే వైఖరిని కొనసాగిస్తే కాంగ్రెస్ ఇలాగే చూసీ చూడనట్లు వ్యవహరిస్తుందా.. లేక చర్యలకు దిగుతుందా అన్న చర్చ కూడా జరుగుతోంది.












Click it and Unblock the Notifications