పడవ ప్రయాణం: ఊరెళ్లేందుకు ఎమ్మెల్యే అష్టకష్టాలు, వారివల్లేనని ఫైర్
అదిలాబాద్/మెదక్: తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి కెసిఆర్ శుక్రవారం నాడు పలుచోట్ల గ్రామజ్యోతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య ఈ సందర్భంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.
అదిలాబాద్ జిల్లా వేమనపల్లి మండలం సంపుటం గ్రామంలో గ్రామజ్యోతి కార్యక్రమానికి వెళ్లేందుకు ఎమ్మెల్యే చిన్నయ్య అష్టకష్టాలు పడ్డారు. నిల్వాయి గ్రామానికి చేరుకున్న ఆయన వాగు ప్రవాహం ఎక్కువగా ఉండటంతో పడవ సాయంతో దాటారు.
సంపుటం గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ మాట్లాడారు. వాగు కష్టాలు గత పాలకుల నిర్లక్ష్యం వల్లనేనని మండిపడ్డారు. తమ హయాంలో వాగు పైన వంతెన నిర్మిస్తామని చెప్పారు.
ఎర్రవల్లిలో కెసిఆర్
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మెదక్ జిల్లా ఎర్రవెల్లిలో శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎర్రవల్లిలో 200 డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఆ తర్వాత గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.
గ్రామజ్యోతిలో భాగంగా ఎర్రవల్లిలో కేసీఆర్ శ్రమదానం కార్యక్రమం ప్రారంభించారు. గ్రామస్థులతో కలిసి శ్రమదానంలో పాల్గొన్నారు. కెసిఆర్ గురువారం ఎర్రవల్లిలో పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్న విషయం తెలిసిందే.