మామా అల్లుళ్లు ఇలాగా: 'తెలంగాణ బంద్'పై రేవంత్, 9వరకు కెసిఆర్కు డెడ్లైన్
హైదరాబాద్: మామాఅల్లుళ్లు (కెసిఆర్, హరీష్ రావు) కలిసి అసెంబ్లీని తమ ఆటవిడుపు కేంద్రంగా మార్చుకుంటున్నారని, ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని, దీనికి నిరసనగా అవసరమైతే అన్ని పక్షాలతో చర్చించి రేపు తెలంగాణ బంద్కు పిలుపునిస్తామని టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
సోమవారం నాడు... మజ్లిస్ మినహా విపక్ష సభ్యులను మూకుమ్మడిగా అధికార టిఆర్ఎస్ సస్పెండ్ చేసింది. దీనిపై విపక్షాలు దుమ్మెత్తిపోశాయి. విపక్ష సభ్యులు మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు.
ప్రతిపక్ష సభ్యులందర్నీ సస్పెండ్ చేయడం దారుణమని రేవంత్ అన్నారు. మామాఅల్లుళ్లకు సభ ఆటవిడుపు కేంద్రంగా మారిందని ఎద్దేవా చేశారు. తొలుత మామ లేచి మాట్లాడుతారని, అనంతరం అల్లుడు సభ్యులను బయటకు పంపిస్తారని విమర్శించారు.
ప్రజా సమస్యల పైన నిలదీస్తే సభ నుంచి బయటపడేస్తామన్న విధంగా ప్రభుత్వం తీరు ఉందన్నారు. రాష్ట్రంలో 14వందల పై చిలుకు రైతు ఆత్మహత్యలు జరిగాయన్నారు. అందరికీ ఆరు లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు రుణమాఫీని మొత్తాన్ని ఒకేసారి రద్దు చేయాలన్నారు.
ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. మామ, అల్లుళ్లు కలిసి మా గొంతు నొక్కుతున్నారన్నారు. రైతులను ఆదుకోవాలని టిడిపి డిమాండ్ చేస్తోందన్నారు. రైతులను ఆదుకోమంటే విపక్షాల గొంతు నొక్కుతారా అని నిలదీశారు.
అన్ని పార్టీలతో చర్చించి బంద్పై నిర్ణయం: ఎర్రబెల్లి
ప్రభుత్వం తీరుకు నిరసనగా అన్ని పార్టీలతో చర్చించి రేపటి బంద్ పైన నిర్ణయం తీసుకుంటామని టిడిపి శాసన సభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. ప్రజా సమస్యల పైన అన్ని పక్షాలతో కలిసి పోరాడుతామన్నారు. రైతుల కోసం జెండాలు పక్కన పెట్టి పోరాడుదామన్నారు. విపక్ష సభ్యుల సస్పెన్షన్ అప్రజాస్వామికం అన్నారు.
సభ్యులందరీ సస్పెన్షన్ దారుణం: ఎల్ రమణ
తెలంగాణ శాసనసభలో ప్రతిపక్ష సభ్యులందరిని ప్రభుత్వం సస్పెండ్ చేయడంపై తెలంగాణ టిడిపి అధ్యక్షులు ఎల్ రమణ మండిపడ్డారు. రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు న్యాయం చేయాలన్నారు. శాసనసభ్యులందర్నీ సభ నుంచి సస్పెండ్ చేయడం దారుణమన్నారు.
ఇందుకు నిరసనగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వ దిష్టి బొమ్మలను దగ్దం చేస్తామన్నారు. కార్యకర్తలు, నేతలు రైతులకు అండగా నిలబడాలని ఎల్ రమణ కోరారు. ప్రభుత్వం తీరుపై గవర్నర్ను కలుద్దామంటే ఆయన అందుబాటులో లేరని జానారెడ్డి చెప్పారు. చరిత్రలో ఇలాంటి ఘటన చూడలేదన్నారు.
మండలిలో ఆరుగురు సభ్యుల సస్పెన్షన్
తెలంగాణ శాసన మండలిలో విపక్ష సభ్యులను సస్పెండ్ చేశారు. రైతుల రుణాలను ప్రభుత్వం తక్షణమే మాఫీ చేయాలని విపక్షాలు ఆందోళన చేశాయి. కాంగ్రెస్, బీజేపీ సభ్యులు ప్లకార్డుల పట్టుకుని మండలి ఛైర్మన్ పోడియాన్ని చుట్టుముట్టి, నినాదాలు చేశారు.
దీంతో, ఐదుగురు కాంగ్రెస్, ఒక బీజేపీ సభ్యుడిని మండలి ఒక రోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్టు ఛైర్మన్ స్వామిగౌడ్ ప్రకటన చేశారు. సస్పెండ్ అయిన వారిలో కాంగ్రెస్ నుంచి షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్, ప్రభాకర్, ఫరూక్ హుస్సేన్, ఆకుల లలిత, బీజేపీ నుంచి రామచంద్ర రావు ఉన్నారు.
10న రాష్ట్ర బంద్, 9వ వరకు గడువు
9వ తేదీ వరకు ప్రభుత్వానికి రైతులకు ఏకమొత్తంలో రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వానికి విపక్షాలు సమయం ఇచ్చాయి. ఆ లోగా రైతు రుణమాఫీ పైన నిర్ణయం తీసుకోకుంటే 10వ తేదీన తెలంగాణ బంద్కు పిలుపునివ్వాలని నిర్ణయించాయి. మరోవైపు, రేపు టిడిపి - బిజెపిలు కెసిఆర్ నియోజకవర్గంలో ఆందోళన చేపట్టనున్నారు.