దటీజ్ వెంకయ్య: ప్లాన్ ప్రకారం నాయుడికి మోడీ కీలక బాధ్యత
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయనకు మంగళవారం నాడు ప్రధాని సమాచార ప్రసార బాధ్యతలను అప్పగించారు. ఇప్పటి దాకా అది ఆర్థిక మంత్రి జైట్లీ వద్ద ఉంది. పూర్తిగా ఫైనాన్స్ పైన దృష్టి సారించేందుకు జైట్లీకి అవకాశమిచ్చేందుకు సమాచార ప్రసార శాఖను వెంకయ్యకు ఇచ్చారు.
పార్లమెంటులో, బయట ప్రభుత్వాన్ని బలపరిచేలా మాట్లాడటంలో వెంకయ్య దిట్ట. ప్రభుత్వం వాయిస్ గట్టిగా వినిపిస్తుంటారు. మోడీ ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ అవి ప్రజల దాకా వెళ్లడం లేదని బీజేపీ భావిస్తోంది.
ఇంటా, బయటా చతురతతో ఆకట్టుకోగలిగిన వెంకయ్యను ఇందుకు బీజేపీ ఉపయోగించుకుంటోంది. సామాన్యుడికి తమ ప్రభుత్వం చేస్తున్న వాటిని ప్రతి వ్యక్తికి తెలిసేలా చేసే ఉద్దేశ్యంలో భాగంగా వెంకయ్యకు ఈ గురుతర బాధ్యతను అప్పగించారని అంటున్నారు.
పబ్లిసిటీ లేకపోవడం వల్లనే సామాన్యుడికి ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియడం లేదని అంటున్నారు. ఇప్పుడు ఆ బాధ్యతను మోడీ.. వెంకయ్య భుజాల పైన పెట్టారు.
పార్లమెంటు వ్యవహారాలలో వెంకయ్య తన సత్తా చాటుకున్నారు. గతంలో పార్టీ అధ్యక్షుడిగా పని చేశారు. వెంకయ్య నిత్యం మీడియాతో సంబంధాలు కలిగి ఉండి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తారని బీజేపీ భావిస్తోంది.
కీలకమైన బిల్లుల సమయంలో, ఇతర సమయాల్లో వెంకయ్య విపక్షాల నుంచి ప్రభుత్వానికి మద్దతు కూడగట్టిన సందర్భాలు ఉన్నాయి. తద్వారా తన సత్తా చాటుకున్నారు. సున్నితమైన సమాచార ప్రసార శాఖకు వెంకయ్య నాయుడు రాజకీయ అనుభవం ఉపయోగపడుతుందని బిజెపి భావిస్తోంది.