ఇదీ సరిహద్దు పరిస్థితి : బాబు, కెసిఆర్లకు మోడీ, రాజ్నాథ్ వివరణ
న్యూఢిల్లీ: యూరీ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్ల యుద్ధ వాతావరణం అలుముకుంది. యూరీ దాడి నేపథ్యంలో భారత సైన్యం పాకిస్థాన్ భూభాగంలోకి ప్రవేశించి ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో 38మంది ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. మరో ఏడుగురు ఉగ్రవాదులను భారత సైన్యం అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
దీంతో భారత సరిహద్దు ప్రాంతంలో ప్రస్తుతం కొంత యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ, రాజ్నాథ్ సింగ్లు సరిహద్దు రాష్ట్రాలకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కె చంద్రశేఖర్ రావులకు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు.
అంతేగాక, సరిహద్దులో పరిస్థితిని తెలుగు రాష్ట్రాల సీఎంలకు వివరించారు.
బుధవారం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్.. తెలంగాణ సీఎం కేసీఆర్కు ఫోన్ చేశారు. పాక్ నియంత్రణ రేఖ వద్ద భారత సైన్యం దాడులు... ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితులను కేసీఆర్కు వివరించారు.

కాగా, నియంత్రణ రేఖ వద్ద పరిస్థితిపై చర్చించేందుకు సాయంత్రం 4 గంటలకు రాజ్నాథ్ అధ్యక్షతన ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరుగనుంది.
ఇది ఇలా ఉండగా, నియంత్రణ రేఖ వద్ద భారత సైన్యం చేపట్టిన దాడుల నేపథ్యంలో పంజాబ్లోని కొన్ని గ్రామాల్లో ప్రజలను ఖాళీ చేయించారు. అంతర్జాతీయ సరిహద్దుకి 10 కి.మీ. దూరంలో ఉన్న గ్రామస్థులను ఖాళీ చేయించి వారిని భద్రతా సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
దీంతో పాటు పంజాబ్లో రెడ్ అలర్ట్ ప్రకటించి ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. అదనపు సరిహద్దు భద్రతా బలగాలను రంగంలోకి దించాయి. పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదుల చొరబాటును కట్టడి చేసేందుకు నియంత్రణ రేఖ వద్ద దాడులు చేస్తున్నట్లు డీజీఎంవో రణ్బీర్సింగ్ వెల్లడించిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications