కెసిఆర్ అంటరానితనం, ఆయన వర్గానికే మంత్రి పదవులా?: రేపు మోత్కుపల్లి దీక్ష
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ స్వయంగా అంటరానితనం పాటిస్తున్నారని మండిపడ్డారు. అంబేద్కర్ విధానాలపై కేసీఆర్కు గౌరవం లేదని ఆరోపించారు.
దళితులను కేబినెట్లోకి తీసుకోకుండా విగ్రహాలు పెడితే అంబేద్కర్ ఆత్మ శాంతించదని అన్నారు. అంబేద్కర్ విగ్రహాలు పెడితే సరిపోదని, దళితులకు సముచిత స్థానం కల్పించాలని మోత్కుపల్లి అన్నారు.
మంత్రివర్గంలోకి ఎస్సీ, ఎస్టీలను తీసుకోవాలని మోత్కుపల్లి డిమాండ్ చేశారు. కెసిఆర్ కుల జనాభా 4లక్షల మంది కూడా లేరని, అయినా 4, 5 మంత్రి పదవులను పొందారని అన్నారు.
70లక్షల మంది జనాభా వున్న మాల మాదిగలకు ఒక్కరికి కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించరా? అని ప్రశ్నించారు. కేసీఆర్ తీరుకు నిరసనగా గురువారం ఎన్టీఆర్ఘాట్లో ఒక్కరోజు దీక్ష చేపట్టనున్నట్లు మోత్కుపల్లి ప్రకటించారు.
కేసీఆర్ విఫలం : ఎంపీ వీహెచ్
విశ్వవిద్యాలయాలను అభివృద్ధి చేయడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని కాంగ్రెస్ ఎంపీ వి హనుమంతరావు విమర్శించారు. తెలంగాణలోని యూనివర్సిటీలకు నిధులు ఇవ్వాలని కేంద్ర హెచ్ఆర్డీ మంత్రిని కలువనున్నట్లు చెప్పారు.
గండిపేట, ఉస్మాన్సాగర్లో మిషన్ కాకతీయ పనులు చేపట్టాలని సీఎం కేసీఆర్, మంత్రి హరీష్రావుకు లేఖ రాశానని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతంపై దిగ్విజయ్ దృష్టి పెట్టాలని, ఎమ్మెల్యేల వలసలపై పీసీసీ, సీఎల్పీ సీరియస్గా తీసుకోవాలని వీహెచ్ కోరారు.