ఫిరాయింపులు: కేసీఆర్తో పోలుస్తూ చంద్రబాబును నిలదీసిన మోత్కుపల్లి
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సమావేశంలో ఆ పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. సోమవారం విజయవాడలో జరిగిన పార్టీ పార్టీ పోలిట్ బ్యూరో సమావేశంలో పార్టీ ఫిరాయింపులపై మోత్కుపల్లి నోరు విప్పారు.
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ అవలంబిస్తున్న వైఖరినే మీరూ అనుసరిస్తున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ నేతలను కాస్తంత ఇబ్బందికర పరిస్థితుల్లోకి పడేశాయని అంటున్నారు. వివరాల్లోకి వెళితే... విజయవాడలో టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏపీ నేతలతో పాటు తెలంగాణ టీడీపీ నేతలు కూడా హాజరయ్యారు.
ఈ సమావేశంలో కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర ప్రాజెక్టులకు చేసిన కేటాయింపులపై చర్చ జరిగింది. అనంతరం మోత్కుపల్లి 'పార్టీ ఫిరాయింపుల విషయంలో కేసీఆర్ ది, మీది ఒకే విధానం' అని అన్నారు. మోత్కుపల్లి వ్యాఖ్యలకు తొలుత స్పందించని చంద్రబాబు నవ్వి ఊరుకున్నారు.

ఆ తర్వాత 'పార్టీ ఫిరాయింపులు ఇప్పుడేమీ కొత్త కాదు. ఏన్నో ఏళ్లుగా కొనసాగుతున్నదే' అని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఈ మధ్య కాలంలో ఏపీలో తెలుగుదేశం పార్టీ ఆపరేషన్ ఆకర్షన్కు తెరలేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.
మరోవైపు రాష్ట్రంలో ఉచితంగా ఇసుక తవ్వుకోవడానికి అనుమతి ఇవ్వాలన్న చంద్రబాబు నిర్ణయాన్ని పోలిట్ బ్యూరో అభినందించింది. దేశంలో ఏ రాష్ట్రంలో ఇటువంటి నిర్ణయం తీసుకోలేదని, ఇప్పటి వరకూ తీసుకొన్న కొన్ని నిర్ణయాల కంటే ఇది చాలా గొప్పదని తెలంగాణకు చెందిన సీనియర్ నేత, మోత్కుపల్లి నర్సింహులు ప్రశంసించారు.












Click it and Unblock the Notifications