రేవంత్ నోరు అదుపులో పెట్టుకో, లేదంటే దాడులు: ఎంపీ ప్రభాకర్ హెచ్చరిక
మెదక్/మహబూబ్ నగర్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, టిడిపి తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తన నోటిని అదుపులో పెట్టుకోవాలని తెలంగాణ రాష్ట్ర సమితి నేత, ఎంపీ ప్రభాకర్ రెడ్డి ఆదివారం నాడు హెచ్చరించారు.
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యక్తిగత విమర్శలను మానుకోవాలని హితవు పలికారు. లేదంటే టిఆర్ఎస్ శ్రేణులు ఊరుకోరని, భౌతిక దాడులతో సమాధానం చెబుతారని హెచ్చరించారు. గజ్వెల్ నియోజకవర్గ అభివృద్ధిపై రేవంత్ బహిరంగ చర్చకు రావాలన్నారు.
కష్టం ఒకరిది భోగం మరొకరిది: చంద్రకుమార్
కష్టం ఒకరిది అయితే భోగం మరొకరు అనుభవిస్తున్నారని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి చంద్రకుమార్ ఆరోపించారు. ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా గద్వాలలో కామ్రేడ్ సుగుణ వర్ధంతి సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
విద్యార్థుల ఆత్మబలిదానాలతో, వివిధ వర్గాల ప్రజలు జైలుకు వెళ్లి తెలంగాణ సాధించుకుంటే.. సిఎం కెసిఆర్ భోగం అనుభవిస్తున్నారని ధ్వజమెత్తారు. పంటలు ఎండిపోయి, గిట్టుబాటు ధరలు లేక అప్పుల బాధలు తాళలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు.
కానీ అధికారులు ఆత్మహత్యలకు వ్యవసాయం కారణం కాదని నివేదికలు ఇవ్వడం దారుణమన్నారు. రైతుల ఆత్మహత్యల పైన బహిరంగ విచారణ చేసి నివేదికలు సమర్పించాలన్నారు. విద్యుత్తు బిల్లుల బకాయిల రూపంలో పరిశ్రమలు ప్రభుత్వానికి రూ.25వేల కోట్లు చెల్లించలవసి ఉందని, వాటిని వసూలు చేస్తే రైతుల కష్టాలు ఒకేసారి తీర్చవచ్చునని చెప్పారు.