నిజామాబాద్ జిల్లాలో మహిళను తన్నిన కేసు: ఎంపీపీ గోపి అరెస్ట్
Recommended Video
నిజామాబాద్: ఇళ్లు, స్థలం విషయంలో మహిళను కాలితో తన్నిన నిజామాబాద్ జిల్లా దర్పల్లి ఎంపీపీ గోపిని పోలీసులు అరెస్టు చేశారు. గొడవ నేపథ్యంలో ఎంపీపీని మహిళ చెప్పుతో కొట్టగా, ఎంపీపీ ఆమెను కాలితో తన్నాడు. ఈ సంఘటన ఆదివారం జరగగా.. కలకలం రేపింది.
స్థలం గొడవ: మహిళను కాలితో తన్నిన ఎంపీపీ, వీడియో వైరల్
దర్పల్లి మండల ఎంపీపీ ఇమ్మడి గోపికి ఇందల్వాయి మండల కేంద్రంలో 44వ జాతీయ రహదారి పక్కన సర్వే నం.1107లో నాలుగెకరాల స్థలం ఉంది. గత ఏడాది ఈ స్థలంలోని గెస్ట్ హౌస్తో పాటు 1125 గజాలను రూ.33.72 లక్షలకు తనకు విక్రయించినట్లు గౌరారం గ్రామానికి చెందిన ఒడ్డె రాజవ్వ పేర్కొంటున్నారు.
అయితే ఎంపీపీ స్థలాన్ని అప్పగించకుండా అదనంగా రూ.65 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నట్లు వాపోయారు. ఈ క్రమంలో ఆదివారం గ్రామస్థులు, బంధువులతో కలిసి వచ్చిన రాజవ్వ గెస్ట్ హౌస్ తాళాన్ని పగులగొట్టి సామగ్రిని బయటపడేశారు.
సొమ్ము చెల్లించినా ఎందుకు ఇబ్బందులకు ఇలా వేధిస్తున్నారని రాజవ్వ.. ఎంపీపీపై చెప్పుతో దాడి చేశారు. ఈ చర్యలతో ఆగ్రహించిన ఆయన కాలితో తన్నారు. దీంతో ఆమె ఎగిరి పడ్డారు. ఆమెతో పాటు వచ్చినవారు ఎంపీపీని గట్టిగా నెట్టేయడంతో ఆయన పడిపోయారు. ఈ ఘటనపై ఇరువర్గాలు పోలీస్ స్టేషన్లో ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేశారు.
మహిళ అని కూడా చూడకుండా ఎంపీపీ రాజవ్వను కాలితో తన్నడంపై విమర్శలు వచ్చాయి. ఆయన తీరును అందరూ ఖండించారు. ఎంపీపీ తీరుకు నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు సోమవారం ఇందల్వాయి మండలంలో బంద్ చేపట్టాయి.