రేవంత్ రెడ్డిపై నమస్తే తెలంగాణ మరో బాంబు
హైదరాబాద్: నోటుకు ఓటు కేసులో కటకటాల పాలైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డిపై నమస్తే తెలంగాణ దినపత్రిక మరో బాంబు వేసింది. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పత్రికగా భావించే నమస్తే తెలంగాణ దినపత్రిక రేవంత్ రెడ్డి అక్రమాలపై సోమవారం ఆ వార్తాకథనాన్ని ప్రచురించింది. పాపాల భైరవుడు అనే శీర్షిక కింద ఆ వార్తాకథనాన్ని ప్రచురించింది.
నమస్తే తెలంగాణ దినపత్రిక కథనం ప్రకారం - హైదరాబాద్ మహా నగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతం జూబ్లీహిల్స్లోని కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీలో సభ్యుడిగా అక్రమాలకు పాల్పడ్డాడు. కాంగ్రెస్ సీనియర్ నేత బంధువు కూతురిని వివాహం చేసుకొని ఆ కోణంలో పైరవీ చేసుకొని రేవంత్రెడ్డి 2000 సంవత్సరంలో ఈ సొసైటీలో సభ్యుడిగా స్థానం సంపాదించుకున్నాడు. రేవంత్ రెడ్డి అనతి కాలంలోనే కోట్లకు పడగలెత్తాడు. అందుకు జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ (జేహెచ్సీహెచ్బీఎస్)లో చోటుచేసుకున్న భారీ అక్రమం దోహదపడింది.
ఇంకా ఆ వార్తాకథనం ఇలా సాగింది - భారీ ఎత్తున కుంభకోణం జరగడంతో ఏకంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్టుమెంట్ సమగ్ర విచారణ నిర్వహించి రేవంత్రెడ్డితో సహా ఆ సొసైటీ సభ్యులు చేసిన భూ అక్రమాల గుట్టును రట్టు చేసింది. అప్పటి సొసైటీ అధ్యక్షుడు, పలువురు సభ్యులు మినహా రేవంత్ కీలక పాత్రధారిగా మిగిలిన మేనేజింగ్ కమిటీ అవకతవకలకు పాల్పడిందని, వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా సిఫార్సు చేసింది.
ఇంకా ఆ పత్రిక ఇలా రాసింది - సొసైటీ జాయింట్ డైరెక్టర్, హౌస్ఫెడ్ ఎండీ విచారణలోనూ ఇదే విషయం తేలింది. దీంతో 2002, అక్టోబర్ 25న ఈ సొసైటీ జాయింట్ డైరెక్టర్, ప్రత్యేక అధికారి అయిన వీ అమరేందర్రావు జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో ఒక ఫిర్యాదు నమోదు చేశారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో రేవంత్ సహా పలువురిపై కేసు (ఎఫ్ఐఆర్ నంబర్ 326/2002, తేది 25.10.2002) కూడా నమోదైంది. కానీ ఆపై చంద్రబాబు సహకారంతో కేసును తొక్కిపెట్టారని స్థానికంగా ప్రచారంలో ఉంది.
ఇది భారీ అక్రమమంటూ నమస్తే తెలంగాణ దినపత్రిక ఇలా రాసింది - జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీకి చెందిన జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ ఒకటిలో బీవోటీ (బిల్డ్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ ప్రాతిపదికన వాణిజ్య సముదాయం నిర్మాణానికి టెండర్లు పిలిచారు. వాస్తవంగా ఈ ప్రక్రియ నిర్వహించాలంటే ముందుగా సొసైటీకి నిర్వహణ కమిటీ సర్వసభ్య సమావేశంలో తీర్మానించాలి. కానీ, అధ్యక్షుడు, కోశాధికారి, పలువురు సభ్యులు లేకుండానే రేవంత్రెడ్డి సహా ఇంకొంతమంది సభ్యులు గుట్టుగా ఈ వ్యవహారాన్ని నడిపించారు.
ఆ కుంభకోణాన్ని పత్రిక ఇలా వివరించింది - ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన విజిలెన్స్ ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సొసైటీ చట్టం-1964 ప్రకారం 79 (1) (ఎఫ్), 79 (1) (హెచ్), సెక్షన్ 83 (బీ) (1) (డీ) కింద అప్పటి కమిటీ కార్యదర్శి, ఉపాధ్యక్షుడు, అదనపు కార్యదర్శి, కోశాధికారి రేవంత్ రెడ్డి నేరాలకు పాల్పడినట్లు తేల్చింది. రాజ్యాంగం ప్రకారం వీరిపై ఐపీసీ 406, 426, 465, 467, 477-ఏ సెక్షన్ల కింద కూడా కేసు పెట్టవచ్చని నివేదికలో స్పష్టం చేసింది. కాగా, ఈ సొసైటీలో జరిగిన అక్రమాలపై చట్టబద్ధమైన కమిటీ నిర్వహించిన విచారణలో మరిన్ని వెలుగుచూశాయి. వాటిని సొసైటీ జాయింట్ రిజిస్ట్రార్, ప్రత్యేక అధికారి జూబ్లీహిల్స్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోనూ పొందుపరిచారు.
నమస్తే తెలంగాణ దినపత్రిక ఆ కథనాన్ని పొడగిస్తూ ఇలా రాసింది - వీజే బాబు అనే వ్యక్తికి ప్లాటు నంబరు 270-సీ1కి ప్రతామ్నాయంగా 861-ఏ ప్లాటును కేటాయించారు. బైలాస్ ప్రకారం ఇందుకు సొసైటీ అనుమతి ఉండాలి. కానీ రికార్డులను తారుమారు చేసి, సొసైటీ తీర్మానమంటూ తప్పుడు పత్రాన్ని సృష్టించి ఈ వ్యవహారాన్ని ముగించారు. నిబంధనలకు విరుద్ధంగా టీ ప్రవీణ అనే మహిళకు కమిటీ సభ్యత్వం ఇవ్వడంతో పాటు ఆమెకు ప్లాటుకు కూడా కేటాయించారు. సభ్యులకు చెందిన ప్లాట్లకు బోగస్ పేర్లతో కోట్లకు అమ్ముకున్నారు.
కోర్టులో రేవంత్ రెడ్డికి, తదితరులకు కోర్టులో చుక్కెదురైందని నమస్తే తెలంగాణ దినపత్రిక రాసింది. అ విషయాలు ఇలా ఉన్నాయి - అనేక విచారణల్లో బట్టబయలైన ఈ అక్రమాలపై క్రిమినల్ కేసు నమోదుకాగా రేవంత్రెడ్డి, ఇతరులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి, తప్పించుకోవాలని చూశారు. ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌస్, బిల్డింగ్ సొసైటీ జాయింట్ రిజిస్ట్రార్, ప్రత్యేక అధికారి కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. రేవంత్రెడ్డి పిటిషన్ను డిస్మిస్ చేస్తున్నట్లుగా కోర్టు స్పష్టం చేసింది.